జగన్ కేసు: విజయసాయి రెడ్డిని ప్రశ్నించిన ఈడి
ఈడి అధికారులు తనను విచారించడం పూర్తయిందని, తాను హైదరాబాద్ వెళ్లిపోతున్నానని విజయసాయి రెడ్డి విచారణ అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈడి అధికారులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. వాటి వివరాలను ఆయన వెల్లడించలేదు. వైయస్ జగన్ కేసులో మరో విడత ఆస్తులు జప్తు చేయడానికి ఈడి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే విజయ సాయిరెడ్డిని విచారించినట్లు చెబుతున్నారు.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఈడి ఇప్పటికే 52 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను జప్తు చేసింది. మరో విడత జప్తునకు సిద్ధమవుతూ విజయసాయి రెడ్డిని ప్రశ్నించినట్లు చెబుతున్నారు. తమ వద్ద ఉన్న సమాచారాన్ని విజయసాయి రెడ్డి తమ ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలతో ఈడి అధికారులు ధ్రువీకరించుకున్నట్లు చెబుతున్నారు. మరో పది, పదిహేను రోజుల్లో రెండో విడత జప్తు ఉండవచ్చునని ప్రచారం సాగుతోంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏ-2 నిందితుడు, జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డికి ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరెట్ నోటీసులు జారీ చేసింది. గత నెల 29(సోమవారం)వ తేదీన ఢిల్లీకి వచ్చి తమ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. అయితే, ఆ రోజు విజయసాయి రెడ్డి ఈడి ముందుకు వెళ్లలేదు. వ్యక్తిగత కారణాల వల్ల తాను హాజరు కాలేనని విజయసాయి రెడ్డి ఈడికి తెలియజేశారు. దాంతో ఈ సోమవారం ఈడి విజయసాయి రెడ్డి తన ముందుకు పిలిచింది.