పన్నెండేళ్లు పూర్తయిన ఐరన్ లేడీ షర్మిల నిరాహార దీక్ష
2000 నవంబర్ 2న ఇంపాల్ లోయలోని మలోంలో అసోం రైఫిల్స్ ఎన్కౌంటర్లో పదిమంది పౌరులు చనిపోయారు. షర్మిల పౌరహక్కుల కార్యకర్త. దీనిపై ఆమె గళమెత్తారు. వెంటనే ఐదో తేది నుండి నిరాహార దీక్ష చేపట్టారు. మాన వహక్కుల ఉద్యమకారులు కిరాతకమైన చట్టంగా అభివర్ణించే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేస్తూ ఇప్పటికీ తన దీక్షపై వెనక్కి తగ్గలేదు.
అయితే ఆమెకు అప్పటి నుండి ముక్కు ద్వారా బలవంతంగా ఫ్లూయిడ్స్ అందిస్తున్నారు. అప్పటి నుండి మొక్కవోని దీక్షతో షర్మిల నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ ఈ చట్టంపై ప్రభుత్వం మాత్రం ఏమాత్రం స్పందించడం లేదు. ఆత్మహత్య నేరం కింద ఆమె జైలుకు, కోర్టుకు, ఇంటికి అంటూ ఇలా పన్నెండేళ్లుగా తిరుగుతున్నారు. ఫ్లూయిడ్స్ బలవంతంగా ఎక్కిస్తున్నారు. ప్రస్తుతం షర్మిల జ్యూడిషియల్ కస్టడిలో ఉన్నారు.
షర్మిలకు మద్దతుగా పౌరహక్కుల కార్యకర్తలు, స్వచ్చంధ సంస్థలు సోమవారం సాయంత్రం మణిపూర్లో పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తారు. ఆమె ఇప్పటి వరకు దాదాపు ఐదు వందల సార్లు కోర్టులు, జైళ్లు, హాస్పిటల్ చుట్టు తిరిగి ఉంటారు. 39 ఏళ్లున్న షర్మిల బరువు ఇప్పుడు కేవలం 37 మాత్రమే. రోజు రోజుకు ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది. పాలకులు స్పందించక పోవడంపై పౌరసంఘాలు మండిపడుతున్నాయి.