అసంతృప్తి: కాంగ్రెసుకు జైపాల్ రెడ్డి 'సలాం' కొడ్తారా?
ఓ మూలకు నెట్టిన తర్వాత బయటకు రాక ఏం చేస్తారని జైపాల్ రెడ్డి సన్నిహితులు అంటున్నారు. ఇంత కాలం కాంగ్రెసు అధిష్టానానికి విశ్వాసంగా ఉండడం వల్ల తనపై తెలంగాణ వ్యతిరేకి అనే ముద్ర పడిందని, అందుకు ఆయన తీవ్రంగా బాధపడుతున్నారని అంటున్నారు. అంతేకాకుండా, తనకు వ్యతిరేకంగా జైపాల్ రెడ్డి ఓ తెలంగాణ లాబీని ఎగదోస్తున్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఇరువురి మధ్య ఇది వరకు వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే.
ఇది వరకు ఓసారి జైపాల్ రెడ్డి కాంగ్రెసు నుంచి తప్పుకున్నారు. అత్యవసర పరిస్థితి విధింపును వ్యతిరేకిస్తూ ఆయన 1975లో కాంగ్రెసుకు రాజీనామా చేశారు. 1978లో మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీపై పోటీ చేసి ఓడిపోయారు. 1977లో జనతా పార్టీలో చేరిన జైపాల్ రెడ్డి ఆ తర్వాత జనతాదళ్లో చేరారు. తిరిగి 1998లో కాంగ్రెసులోకి వచ్చారు.
వచ్చే ఎన్నికల్లో జైపాల్ రెడ్డికి తీవ్రమైన ఎదురు దెబ్బ తగిలే అవకాశాలున్నాయి. తెలంగాణ వ్యతిరేకిగా ఆయనపై ముద్ర పడింది. దీంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు. జైపాల్ రెడ్డి 2009 చేవెళ్ల నియోజకవర్గం నుంచి అత్యంత కష్టంగానే విజయం సాధించారు. ఈ స్థితిలో ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన స్థితే ఉందని ఆయన వ్యతిరేకులు అంటున్నారు.
అయితే, జైపాల్ రెడ్డి తన తెలంగాణ వ్యతిరేక ముద్రను తొలగించుకోవడానికి తెలంగాణ సాధన కోసం ఓ పార్టీ పెట్టే అవకాశాలున్నాయనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే, ఆయన వద్ద పార్టీని నడిపేంత సొమ్ము లేదని, అది వచ్చే అవకాశాలు కూడా లేవని అంటున్నారు. అయితే, జైపాల్ రెడ్డి మాత్రం తన అసంతృప్తి గానీ తన భవిష్యత్తు కార్యాచరణపై గానీ నోరు మెదపడం లేదు.