కిరణే ముఖ్యమంత్రి, తెలంగాణపైనే అడిగారు: వాయలార్
తెలంగాణపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నారని అన్నారు. అందరి అభిప్రాయాలను తాను తీసుకొని తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి చేరవేస్తున్నానని చెప్పారు. తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ అధ్యక్షురాలే అని చెప్పారు. తమను తెలంగాణ ప్రాంత నేతలు పలువురు కలిశారని, ఎవరూ ముఖ్యమంత్రి మార్పు పైన చర్చించలేదని, కేవలం తెలంగాణను పరిష్కరించాలని మాత్రమే కోరారని తెలిపారు.
కాగా ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డిని మార్చి ఆయన స్థానంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు.. మర్రి శశిధర్ రెడ్డి, కుందూరు జానా రెడ్డి లేదా డి.శ్రీనివాస్ను కూర్చుండబెడతారనే వార్తలు వచ్చాయి. నవంబర్ 9వ తేది లోగా కిరణ్ మార్పు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాయలార్ రవి మంగళవారం స్పందిస్తూ.. మార్పు కేవలం ఊహాగానాలే అని కొట్టి పారేశారు.
రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో జరిగిన కాంగ్రెసు ప్రజా సభకు వెళ్లిన రాష్ట్ర నేతలు పలువురు ఆ సభ ముగిసిన తర్వాత కూడా అక్కడే మకాం వేశారు. సోమవారం సోనియా గాంధీ సహా పలువురు పార్టీ పెద్దలను కలిసి తెలంగాణపై తేల్చాలని, ముఖ్యమంత్రి మార్పు అవసరం లేదని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.