సమాధానం చెప్తాం: తెలంగాణపై నాగంకు కెటిఆర్ కౌంటర్
నాగం జనార్ధన్ రెడ్డి తన భరోసాయాత్రకు మద్దతివ్వాలని కోరుతూ తమను సంప్రదించలేదన్నారు. రేపటి నుండి రెండు రోజుల పాటు కరీంనగర్లో మేధోమథనం నిర్వహిస్తున్నామని, ఇందులో తెలంగాణపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంపై ఈ సమావేశంలో డిక్లరేషన్ ప్రకటిస్తామని, అన్ని అంశాలపై తమ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పష్టత ఇస్తారని చెప్పారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కాపాడటానికి కొందరు ఎమ్మెల్యేలు లాబీయింగ్ చేయడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు పార్టీ పనులపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదన్నారు. ఢిల్లీలో ర్యాలీకి పరుగులు తీసిన ప్రభుత్వం నీలం తుఫాను కారణంగా రైతులు అష్టకష్టాల్లో ఉంటే మాత్రం నిద్రపోతున్నట్లుగా ఉందన్నారు. తుఫాను విలయంతో రైతులు సర్వం కోల్పోతే కార్యాచరణకు దిగడానికి బదులు ముఖ్యమంత్రి మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకునేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ప్రజా సమస్యలపై స్పందించడం లేదన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏడాదిన్నర కిందట అందాల్సిన పరిహారం రైతులకు ఇప్పటికీ ఇవ్వలేదంటే ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోందన్నారు.