అండగా ఉంటాం: విజయమ్మ, ఏరియల్ సర్వేకు కిరణ్
బివి రాజు పాఠశాలలో బాధితులను ఆమె కలుసుకొని వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులను పరామర్శించిన వియమ్మ వారికి అండగా ఉంటామని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి కనీసం రూ.10వేలు నష్టపరిహారం చెల్లించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతులతో పాటు కౌలు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రూ.రెండు వేల కోట్లతో గోదావరిని ఆధునీకరణ చేయాలని దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి భావించారని కానీ, మూడేళ్లుగా ఆ దిశలో ఎలాంటి చర్యలు కనిపించడం లేదన్నారు. అందువల్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. బాధితులను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లడమేమిటని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే
మరోవైపు వాతావరణం అనుకూలించక పోవడంతో రెండు గంటలు శంషాబాద్ విమానాశ్రయంలో నిరీక్షించిన ముఖ్యమంత్రి ఆ తర్వాత హెలికాప్టర్లో విజయవాడకు చేరుకున్నారు. ఆయన గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా తుఫాను బాధిత ప్రాంతాల్లో ఎరియల్ సర్వే చేస్తారు.