జగన్ ఫ్యాక్టర్: డిసిసి పదవికి కందుల విముఖత
వైయస్ జగన్ ప్రాబల్యం కారణంగానే శివానంద రెడ్డి ఆ పదవిని స్వీకరించడానికి నిరాకరిస్తున్నట్లు సమాచారం. తాను అ పదవిని చేపట్టలేనంటూ శివానంద రెడ్డి బొత్స సత్యనారాయణకు ఫాక్స్ ద్వారా తెలియజేసినట్లు తెలుస్తోంది. తనకు సమాచారం ఇవ్వకుండా తనను డిసిసి ఇంచార్జీ అధ్యక్షుడిగా నియమించారని కందుల శివానంద రెడ్డి అంటున్నారు.
మునిగిపోతున్న నావకు తాను ఏ విధంగా సారథ్యం వహిస్తానని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. ఖాళీ అయిన కాంగ్రెసు పార్టీకి సారథ్యం వహించేలా చేసి, దెబ్బ తీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన అంటున్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన ముగ్గురు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు.
కడప లోకసభకు, పులివెందుల శాసనసభకు జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయడానికి మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డితో కలిసి కందుల శివానంద రెడ్డి తీవ్రంగా శ్రమించారు. అయితే, ఫలితం కనిపించలేదు. ఇప్పుడు కూడా జగన్ను ఎదుర్కోవడానికి కందుల శివానంద రెడ్డిని డిసిసి ఇంచార్జీ అధ్యక్షుడిగా నియమించినట్లు చెబుతున్నారు.