వైయస్సార్ కాలనీలో చిరంజీవి: కిరణ్ను కల్సిన అమల
పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకున్న చిరంజీవి ఏలూరులోని వైయస్సార్ కాలనీలో నీలం తుఫాను బాధితులను పరామర్శించారు. వారిని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన వారిని, ఇళ్లు కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని చిరంజీవి హామీ ఇచ్చారు.
మరోవైపు హీరో అక్కినేని నాగార్జున సతీమణి అక్కినేని అమల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని హైదరాబాదులో కలుసుకున్నారు. నీలం తుఫాను బాధితులను ఆదుకోవాలని ఆమె ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. నీలం తుఫాను కారణంగా ఏడెనిమిది జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా ఇటీవల వచ్చిన నీలం తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ పంట నష్టం జరిగింది. వారిని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పరామర్శించారు.