ఎంఐఎంకు బుజ్జగింపులు: నాతో 5గురున్నారు.. పెద్దిరెడ్డి
పార్టీ పార్లమెంటు సభ్యుడు ఎంఏ ఖాన్ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీతో ఫోన్లో మంతనాలు జరిపారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని అసదుద్దీన్కు సూచించారు. ఎంఐఎం తమకు నమ్మకమైన భాగస్వామ్యపక్షమని ఖాన్ అన్నారు. ఖాన్తో పాటు మాజీ మంత్రి షబ్బీర్ అలీని కూడా అధిష్టానం రంగంలోకి దింపింది. ఆయన నేరుగా ఎంఐఎం నేతలతో మాట్లాడనున్నారు.
షబ్బీర్ అలీ ఖాన్, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ దానికంటే ముందు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రులు దానం నాగేందర్, విశ్వరూప్, ముఖేష్ గౌడ్, వట్టి వసంత్ కుమార్తో పాటు రాజమండ్రి ఎంపీ ఉండవల్ల అరుణ్ కుమార్ పాల్గొన్నారు. షబ్బీర్ అలీ ఎంఐఎం నేతలతో సమావేశమై వారిని దారికి తెచ్చే ప్రయత్నాలు చేయనున్నారు. మరోవైపు ఎంఐఎం పార్టీ నేతల భేటీ కొనసాగుతోంది.
నాతో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు
తనతో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని, తాము రాజీనామా చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మైనార్టీలో పడుతుందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో అన్నారు. నెలాఖరులోగా ముఖ్యమంత్రిని మార్చకపోతే తాను రాజీనామా చేసేందుకు వెనుకాడే ప్రసక్తి లేదన్నారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్పులేక ముఖ్యమంత్రి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గానికి నిధులను ఇవ్వడం లేదన్నారు.