మజ్లీస్ ఉద్దేశం వెల్లడవుతుంది, సరి కాదు: విహెచ్
కాంగ్రెసు అన్యాయం చేసిందని మజ్లీస్ నేత అసదుద్దీన్ అనడం సరి కాదని ఆయన అన్నారు. తమ పార్టీ కార్యకర్తలకు కూడా ఇవ్వని ప్రాధాన్యం మజ్లీస్కు ఇచ్చామని ఆయన చెప్పారు. ఏ ఇంటికి వెళ్లి అడిగినా ఈ విషయం చెప్తారని ఆయన అన్నారు.
ఏ పాపం తెలియని కాంగ్రెసుపై మజ్లీస్ నిందలు వేయడం సరి కాదని అన్నారు. మజ్లీస్ దూరమైనంత మాత్రాన మైనారిటీలు కాంగ్రెసు పార్టీకి దూరం కాబోరని ఆయన అన్నారు. కాంగ్రెసు సెక్యులర్ పార్టీ అని ఆయన చెప్పుకున్నారు. కాంగ్రెసుతో మజ్లీస్ కలిసి ఉండాలని తాము కోరుకుంటున్నామని ఆయన అన్నారు. సీజన్ను బట్టి స్నేహితులు మారుతుంటారని ఆయన అన్నారు.
తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు అసంతృప్తితో ఉన్న మాట నిజమేనని, అయితే పార్టీకి దూరం కాబోరని విహెచ్ అన్నారు. ఇతర పార్టీల్లోకి వెళ్తే తెలంగాణ వస్తుందని అనుకోవడం సరి కాదని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు పార్టీ అధిష్టానానికి లేఖ రాసే అవకాశం ఉందని ఆయన అన్నారు.
ప్రభుత్వంతో మద్దతు ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తాము ఎంతగానో ప్రయత్నం చేశామని, మరోసారి ఎంఐఎం నేతలతో మాట్లాడ్డానికి ప్రయత్నిస్తామని ఎంపీ ఎంఏ ఖాన్ తెలిపారు. ఈ అంశంపై హైకమాండ్తో మట్లాడతామన్నారు. హైకమాండ్ ప్రతినిధులు కూడా ఎంఐఎం నేతలతో చర్చిస్తారని ఎంఏ ఖాన్ చెప్పారు.
ప్రభుత్వంతో ఎంఐఎం పార్టీ మద్దతు ఉపసంహరణపై మంత్రి ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ తమకు మిత్రపక్షమని, ఒక్క రోజులో తమ ప్రభుత్వంతో మద్దతు ఉపసంహరించుకుంటుందని భావించడం లేదన్నారు. ఎంఐఎం నేతలతో చర్చలు జరపుతామని మంత్రి ముఖేష్గౌడ్ అన్నారు.