సూకీకోసం సీమ రుచులు రెడీ: పాపసానిపల్లి ముస్తాబు
పాపసానిపల్లి అనంతపురం జిల్లాలోని కర్నాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉంది. ఈ గ్రామంలో 16 మహిళా సంఘాలు ఉన్నాయి. ఈ గ్రామం అదర్శ గ్రామంగా నిలిచింది. దీంతో దీన్ని సందర్శించేందుకు సూకీ వస్తున్నారు. జిల్లా అధికాలులు మాట్లాడుతూ.. తాము సూకీకి రాయలసీమ తీపి పదార్థాలు రుచి చూపిస్తామని చెబుతున్నారు. కజ్జికాయలు, రవ్వ లడ్డు, అత్తి రసాలు, కొడుబాలే, రాగి, జొన్న, సబ్జి రోటీ తదితరాలను ఆమెకు ఆఫర్ చేస్తామని చెబుతున్నారు.
డిఆర్డిఏ అధికారులు ధర్మవరం సిల్క్ బట్టలను బహూకరించనున్నట్లు చెప్పారు. సూకీతో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్, పలువురు రాష్ట్ర మంత్రులు రానున్నారు. దీంతో సూకీతో పాటు మిగిలి వారికీ ఆహ్వాన బ్యానర్లు వెలుస్తున్నాయి. స్థానిక పాఠశాలను అపురూపంగా తీర్చిదిద్దుతున్నారు. గదులకు కొత్త రంగులు వేస్తున్నారు. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని విస్తరించి రోడ్డు పనులు చేపట్టారు.
సూకీ వస్తున్న నేపథ్యంలో గ్రామాన్ని శుభ్రం చేసే పనుల్లో యంత్రాంగం నిమగ్నమయింది. ఆయా శాఖల అధికారులు అక్కడే మకాం వేసి పనులను పర్యవేక్షిస్తున్నారు. కాగా సూకి బెంగళూరు మీదుగా ఉదయం 9.20 నిమిషాలకు పాపసానిపల్లికి రానున్నారు. పాపసానిపల్లి బెంగళూరుకు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది.