టిడిపికి ఫేవర్.. జగన్ మనిషి: మంద వర్సెస్ డికె అరుణ
మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గ నేతలతో పరిశీలకుడు ప్రశాంత్ ఠాగూర్ రెండు రోజుల క్రితం విడివిడిగా సమావేశమయ్యారు. నాగర్ కర్నూలు ఎంపి మంద జగన్నాథంపై డికె అరుణ స్వయంగా ఆయనకు ఫిర్యాదు చేశారు. శనివారం కూడా నియోజకవర్గ నేతలతో ప్రశాంత్ భేటీ అయ్యారు.
ఈ భేటీలో డికె అరుణ, మంద వర్గాలు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారట. డికె అరుణ వర్గీయులు మంద స్థానంలో లోకసభకు మాజీ ఎంపీ మల్లు రవి పేరును సూచించారట. మంద జగన్నాథం తెలుగుదేశం పార్టీ వారికే పని చేస్తున్నారని వారు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన ఎంపి కోటా నిధులు ఎవరెవరికి కేటాయించింది రికార్డులు పరిశీలించాలని కోరారట.
ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి విజయానికి ఏమాత్రం కృషి చేయలేదని, ఆయనకే తిరిగి టిక్కెట్ ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి వర్గం హెచ్చరించిందట కూడా. మరోవైపు మంద వర్గీయులు డికె అరుణపై ఫిర్యాదు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న నాయకుడు గతంలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం చేశారని, ఆయనకే పదవులు ఇప్పింటారని వారు ఆరోపించినట్లుగా తెలుస్తోంది. పార్టీ వ్యతిరేకుల్ని డికె అరుణ ప్రోత్సహిస్తున్నారని, సిట్టింగ్ ఎంపీకే తిరిగి టిక్కెట్ ఇవ్వాలని ప్రశాంత్కు చెప్పారట.