కిశోర్ చంద్రదేవ్ లేఖ వ్యక్తిగతం: సందీప్ దీక్షిత్
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా తాను ఏ విధమైన లేఖ రాయలేదని కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ స్పష్టం చేసారు. తాను ఢిల్లీలోనే ఉంటున్నానని, ఏదైనా ఉంటే నేరుగా మాట్లాడుతానని, లేఖలు రాయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. బాక్సైట్ నిక్షేపాలపై మాత్రం తాను లేఖ రాశానని, దానిపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవడం లేదని, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తనకు తెలియదని ఆయన అన్నారు. బొత్స సత్యనారాయణపై రాసినట్లు చెబుతున్న లేఖ ఎక్కడి నుంచి వచ్చిందో తనకు తెలియదని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు అసమర్థులు అని ఆరోపిస్తూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి కేంద్రమంత్రి కిషోర్ చంద్ర దేవ్ లేఖ రాసినట్లుగా సోమవారం వార్తలు వచ్చాయి. కిషోర్ చంద్ర దేవ్ తన లేఖలో బొత్స, కిరణ్లపై తీవ్రమైన విమర్శలు చేసినట్లుగా తెలుస్తోంది. కిరణ్ ఓ అసమర్థ నేత అని లేఖలో అన్నట్లు తెలుస్తోంది.
తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం అన్నారు. తనపై కథనం వచ్చిన ఆంగ్ల దినపత్రికపై తాను పరువు నష్టం దావా వేస్తానని బొత్స చెప్పారు. తాను నామినేటెడ్ అభ్యర్థినని, తనను మార్చినంత మాత్రాన ఏమీ జరగదన్నారు. కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ తనకు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా లేఖ రాసినట్లు తనకు తెలియదన్నారు.