గుత్తా సుఖేందర్ ప్రకటన: జగన్ పార్టీలోకా, తెరాసలోకా?
కాగా ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరితే ఆయన నేతృత్వంలో పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఉదయం చెప్పిన విషయం తెలిసిందే. డిసెంబర్ 9లోగా కేంద్రం తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని, తెలంగాణకు అనుకూలంగా ఉండాలని, లేదంటే తాము వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరతామని పరోక్షంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
కేంద్రం తెలంగాణను ప్రకటించకుంటే తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డిసెంబర్ 9లోగా తెలంగాణ ప్రకటన రాకుండే తాను రాజీనామా చేస్తానని చెప్పారు. ఆస్తుల కేసు విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఓ న్యాయం, మంత్రి ధర్మాన ప్రసాద రావుకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.
ఆయన సోదరుడు, ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రజలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, సమయం వస్తే ఆయన నాయకత్వానికి మద్దతిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తమకు గాడ్ ఫాదర్ అని, ఆయన అంటే తమకు విపరీతమైన అభిమానమన్నారు. రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి పాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు. దీనికి కాంగ్రెసు పార్టీ అధిష్టానం కూడా ఓ కారణమే అన్నారు. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో ఎవరు వచ్చినా పరిస్థితి బాగుపడదన్నారు. కేంద్రం గతంలో ప్రకటించిన తెలంగాణ ఇస్తేనే కాంగ్రెసు పార్టీలో కొనసాగుతామని చెప్పారు.
అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి మాజీ మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించకుండా సమర్థించకుండా ప్రజలు కోరే పార్టీలో చేరుతానని ప్రకటించడంతో ఆయన జగన్ పార్టీలో చేరుతారా లేక వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారా అనే ప్రశ్న తలెత్తుతోంది.