త్రీడి మోడీ: ఒకేసారి 4 చోట్ల ప్రచారం, వరల్డ్లో ఫస్ట్ టైం
3డి హోలోగ్రాఫక్ టెక్నాలజీ, ఉపగ్రహ అనుసంధానం సాయంతో ఆయన అదివారం ఒకేసారి అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్కోట్లలో ప్రచారం చేశారు. మోడి గుజరాత్ రాజధాని గాంధీనగర్లోని ఓ స్టూడియోలో నిలబడి మాట్లాడారు. టెక్నాలజీతో అది పై నాలుగు నగరాల్లో మోడీ స్వయంగా మాట్లాడుతున్నట్లుగా భ్రమ కల్పిస్తుంది. ఆయన ప్రసంగాన్ని వినేందుకు ఈ నాలుగు నగరాల్లో ప్రత్యేక తెరలను ఏర్పాటు చేశారు.
ఈ పరిజ్ఞానంతో ఎక్కడో ఉన్న వ్యక్తి ఎదురుగా మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తుంది. త్రీడీ హాలోగ్రాఫిక్ టెక్నాలజీతో దేశ రాజకీయ రంగం మునుపెన్నడూ ఎరుగని సరికొత్త ఒరవడికి మోడీ తెర తీశారు. మోడీ కనిపించగానే నాలుగు నగరాల్లోని జనం ఒక్కసారిగా కేరింతలు కొట్టారు.
కాగా.. ఎప్పటిలాగానే తన ప్రసంగంలో మోడీ ప్రతిపక్ష కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. తనను కోతితో, ఎలుకతో వారు పోల్చడాన్ని గర్వంగా భావిస్తున్నానన్నారు. ఎందుకంటే.. ఈ జీవులు దేవుడి దూతలు కాబట్టి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు రామాయణాన్ని చదివి ఉంటే వారికి వానర శక్తి గురించి మంచి అవగాహన ఉండేదన్నారు. హనుమంతుడి భక్తిప్రపత్తుల గురించి, సేవాతత్పరత గురించి ప్రపంచం మొత్తానికీ తెలుసన్నారు.
అదే కోవలో తనకు గుజరాత్కు సేవ చేసుకునే అదృష్టం లభించిందని అన్నారు. ఆరుకోట్ల మంది గుజరాతీల్లో ప్రతి ఒక్కరూ తనకు రాముడితో సమానమని, తాను వారి హనుమంతుడినని అన్నారు. అలాగే ఎలుక విఘ్నాలను హరించే వినాయకుడి వాహనమని, ఆ స్వామిని తన వీపున మోసే అదృష్టానికి గర్విస్తానని అన్నారు. త్రీడీ టెక్నాలజీతో ఇలా ఒక నేత ఒకేసారి నాలుగుచోట్ల ప్రసంగించడం ప్రపంచంలోనే ఇది తొలిసారి అని తెలిపారు.