హరీష్ చీడ పురుగు, వైయస్ ఉంటే వెళ్లేవాడు: ఎర్రబెల్లి
కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఎందుకు విమర్శించడం లేదని, తెలంగాణపై అఖిలపక్ష సమావేశం పెట్టాలని సోనియాను ఎందుకు అడగలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ జెఎసి నుంచి తమ పార్టీని తెరాస వెళ్లగొట్టిందని ఆయన విమర్శించారు. సిద్ధిపేటలో ఓడిపోతాననే భయంతోనే కెసిఆర్ గతంలో కరీంనగర్లో పోటీ చేశారని ఆయన అన్నారు. దమ్ముంటే కెసిఆర్ మళ్లీ మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయాలని ఆయన సవాల్ చేశారు.
తెలంగాణపై తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై తమ పార్టీ స్పష్టంగా ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చేందుకు కెసిఆర్ ప్రయత్నించారని తప్పు పట్టారు. కెసిఆర్ మాదిరిగా తాము తెలంగాణ ఉద్యమాన్ని అమ్ముకోలేదని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కెసిఆర్ అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే హరీష్ రావు కాంగ్రెసులో చేరి ఉండేవారని ఆయన అన్నారు. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటపై నిలబడితే సంతోషమేనని ఆయన అన్నారు. కెసిఆర్లా సమ్మెను తాము సమ్మెను తాకట్టు పెట్టలేదని, సమ్మెను తాకట్టు పెట్టి తెలంగాణను అడ్డుకుంది కెసిఆరే అని ఆయన విమర్సించారు.
తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖ అందిందని ప్రధాని కార్యాలయం నుంచి తమకు సమాధానం వచ్చిందని తెలుగుదేశం పార్టమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు చెప్పారు. కావాలనే లేఖ తనకు అందలేదని, లేఖ విషయం తనకు తెలియదని కేంద్రం హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే అంటున్నారని ఆయన విమర్శించారు. పార్టీ పార్లమెంటు సభ్యులు మంగళవారం మెదక్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును చింతపల్లి దర్గా వద్ద కలిశారు.
నీలం తుఫాను వల్ల నష్టం జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఈ విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామని ఆయన చెప్పారు. రైతు సమస్యలపై తాము పార్లమెంటును స్తంభింపజేస్తామని ఆయన చెప్పారు. యుపిఎ ప్రభుత్వంపై తృణమూల్ కాంగ్రెసు ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. రిటైల్ రంగంలో ఎఫ్డిఐలకు తాము వ్యతిరేకమని ఆయన చెప్పారు.
మెదక్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు తమపై విమర్శలు చేస్తున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తమపై చంద్రబాబు చేస్తున్న విమర్శలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు.
ప్రజా సమస్యలపై తాము నిరంతరం పోరాటం చేస్తున్నామని, అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజా సమస్యలపై పోరాడుతున్నట్లుగా నటిస్తారని ఆయన అన్నారు. తెలంగాణకు వ్యతిరేకం కాకపోతే సకల జనుల సమ్మెలో ఎందుకు పాల్గొనలేదని ఆయన టిడిపి నాయకులను అడిగారు.