జగన్ వైపు జంప్లు: అధిష్టానం రెస్పాన్స్, మార్పుపై నో
కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ లేఖపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని చెప్పారు. ఆయన లేఖ విషయం అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. అధిష్టానానికి అభిప్రాయం తెలిపే హక్కు ఆయనకు ఉందని, సీనియర్ నేతగా పరిస్థితులపై ఆయన లేఖ రాయడంలో తప్పు లేదన్నారు. వారం రోజులుగా రాష్ట్ర పరిస్థితులపై తాను ఎవరితోనూ మాట్లాడటం లేదని, ముఖ్యమంత్రిని మార్చే విషయంలోనూ ఎలాంటి వ్యాఖ్యలు చేయనన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి పలువురు నేతలు వెళ్తారనే ప్రచారంపై ఆ పార్టీ నేత పాలడుగు వెంకట్రావు కూడా హైదరాబాదులో మండిపడ్డారు. కొందరు నేతలు బయటకు వెళ్లడం వల్ల కాంగ్రెసు పార్టీకి కొంత నష్టం జరగడంలో వాస్తవమున్నప్పటికీ మారుతున్న వ్యక్తి ఎలాంటి వారో ప్రజలకు తెలిసిపోతుందని అన్నారు. వారు మార్కెట్ వ్యక్తులు అని ప్రజలు గుర్తిస్తారన్నారు. పార్టీకి నష్టమే అయినా పెద్దగా ఉండదన్నారు.
మనం ఆ పార్టీలోకి వెళ్తే ప్రజలు కూడా తమ వెంట వస్తారని అనుకోవడం తప్పవుతుందన్నారు. ప్రజలు అన్నింటిని పరిశీలిస్తున్నారని, వెళ్తామని చెప్పే వారు కాంగ్రెసులో ఏం తప్పుందో చెప్పాలని నిలదీశారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని మరిచి నాయకులు పార్టీని వదిలి పెట్టి వెళ్తున్నారని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని కేంద్రమంత్రి పవర్ కుమార్ బన్సాల్ చిత్తూరు జిల్లా తిరుపతిలో అన్నారు. ప్రభుత్వం పడిపోతుందనే వార్తలు కేవలం ఊహాజనితం మాత్రమే అన్నారు.