తెరాసలోకి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటూ ప్రచారం
అయితే తాను తెరాసలో చేరుతున్నట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని వర్ధన్నపేట శాసనసభ్యుడు శ్రీధర్ చెప్పారు. తాను ఏ పార్టీలో చేరనని తెలిపారు. కాంగ్రెసులోనే ఉంటానని చెప్పారు. తనతో ఏ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు చర్చలు జరపలేదన్నారు. తాను కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవమన్నారు. కాంగ్రెసు పార్టీలో ఉంటూనే తెలంగాణ కోసం ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.
మానకొండూరు శాసనసభ్యుడు ఆరెపల్లి మోహన్ కూడా తెరాసలోకి వెళ్తున్నట్లుగా వస్తున్న వార్తలను కొట్టి పారేశారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెసులోనే ఉంటానని చెప్పారు. పార్టీ మారతారనే ప్రచారం అంతా తప్పు అన్నారు. తాను 1978 నుండి కాంగ్రెసు పార్టీలో కొనసాగుతూ, వివిధ పదవులు అనుభవించానని చెప్పారు.
కాగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్ తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులతో చర్చించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తెరాసలోకి పలువురు టిడిపి, కాంగ్రెసు ప్రజాప్రతినిధులు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు, సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావులు టిడిపి, కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు గాలం వేసే పనిలో పడ్డారట. డిసెంబర్ నెలలో పెద్ద ఎత్తున వలసలు ప్రోత్సహించాలని కెసిఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.