లిక్కర్ సిండికేట్: బొత్స, మోపిదేవిలకు ఎసిబి క్లీన్చిట్!
ఎసిబి నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బొత్స, మోపిదేవిలపై ఎలాంటి ఆధారాలు లేవని నివేదికలో వెల్లడించారు. మద్యం సిండికేట్ల కేసులో 1100 మందిని నిందితులుగా ఎసిబి పేర్కొంది. వందమంది ప్రభుత్వ అధికారులపై విచారణ చేయాలని, ప్రభుత్వానికి ఎసిబి సిఫార్సు చేసింది. నిందితులుగా పేర్కొన్న వారిలో ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు ఉన్నారు.
మద్యం సిండికేట్లలో ప్రభుత్వానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. తుది నివేదికలో నాలుగు ఆసక్తికరమైన అంశాలను ఎసిబి ప్రస్తావించింది. నిందితులపై ప్రాసిక్యూషన్, క్రమశిక్షణాపరమైన చర్యలు, శాఖాపరమైన చర్యలు, విచారణకు సిఫార్సు చేయాలని సూచించింది. నిందితులైన ఉద్యోగులందరి పైనా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, నాలుగు వందల మంది ఉన్నారని సూచించింది.
300 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, 250 మందిపై విచారణకు ఎసిబి సిఫార్సు చేసింది. రూ.50 నుండి 75 కోట్ల ముడుపులు చేతులు మారినట్లుగా ఆరోపించింది. ప్రజాప్రతినిధుల పాత్రపై ఆధారాలు లేవని తెలిపింది. 48 కేసులు నమోదయ్యాయని, 132 మందిని అరెస్టు చేసినట్లు చెప్పింది. నిందితుల్లో బాలరాజు, నున్నా రమణ సహా 85 మంది ప్రయివేటు వ్యక్తులున్నారని పేర్కొంది.
మూడువేలకు పైగా తెల్ల రేషన్ కార్డుదారులు మద్యం దుకాణాలను కలిగి ఉన్నట్లుగా నివేదికలో ఎసిబి పేర్కొంది. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని సూచించింది. కాగా మద్యం సిండికేట్ వ్యవహారంలో ఎసిబి నివేదిక కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద తలలను వదిలి పెట్టారనే విమర్శలు వస్తున్నాయి. కాగా నివేదికపై అధికార యంత్రాంగంలో కలకలం రేగుతోంది.