మార్పు ప్రచారం: కిరణ్ను కల్సిన 4గురు ఎమ్మెల్యేలు
తాము ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తి లేదని కిరణ్కు చెప్పారని తెలుస్తోంది. ముఖ్యమంత్రిని కలిసిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలను ఖండించారు. ఇలాంటి అవాస్తవ ప్రచారంపై తాను మాట్లాడడానికి ఏమీ లేదని చెప్పారు. ఆరెపల్లి మోహన్, శ్రీధర్లు తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వెళతారనే ప్రచారం జరగగా, ఆకుల రాజేందర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారని, అలాగే సుధీర్ రెడ్డి కూడా మారుతారనే ప్రచారం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఇద్దరు కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు చేరుతున్నారనే ప్రచారం మంగళవారం ఒక్కసారిగా కాంగ్రెసు పార్టీలో పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీధర్లు తెరాసలోకి ఈ రోజు సాయంత్రమే వస్తున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఇది ఇటు కాంగ్రెసులో, అటు తెరాసలో కలకలం రేపింది.
అయితే తాను తెరాసలో చేరుతున్నట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని వర్ధన్నపేట శాసనసభ్యుడు శ్రీధర్ చెప్పారు. తాను ఏ పార్టీలో చేరనని తెలిపారు. కాంగ్రెసులోనే ఉంటానని చెప్పారు. తనతో ఏ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు చర్చలు జరపలేదన్నారు. తాను కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవమన్నారు. కాంగ్రెసు పార్టీలో ఉంటూనే తెలంగాణ కోసం ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.
మానకొండూరు శాసనసభ్యుడు ఆరెపల్లి మోహన్ కూడా తెరాసలోకి వెళ్తున్నట్లుగా వస్తున్న వార్తలను కొట్టి పారేశారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెసులోనే ఉంటానని చెప్పారు. పార్టీ మారతారనే ప్రచారం అంతా తప్పు అన్నారు. తాను 1978 నుండి కాంగ్రెసు పార్టీలో కొనసాగుతూ, వివిధ పదవులు అనుభవించానని చెప్పారు.