మేమే గడువు పెట్టుకున్నాం: కెకె, కెసిఆర్తో భేటీ
కేశవరావు ఎవరి ఒత్తిళ్లకూ లొంగడని, తాను రాసిన లేఖ పార్టీ అధిష్టానానికి నేడో రేపో అందుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ ఇవ్వబోమని పార్టీ అధిష్టానం చెప్తే ఏం చేయాలో నిర్ణయించుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ వద్దన్న పార్టీలో తమ పార్టీ తెలంగాణ నేతలు చేరుతారని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వబోమని కాంగ్రెసు అధిష్టానం చెప్తే తాను ప్రజలతో ఉంటానని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను చేయాల్సింది చేస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ సాధన విషయంలో తాను వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఏం చేయడానికైనా తాను సిద్ధపడుతానని ఆయన చెప్పారు. తెలంగాణ ఫ్రంట్ పెడతామనే వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ కోసం పోరాడుతామని చెప్పారు. తెలంగాణ కోసం అందరూ కలిసి పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.
కెసిఆర్తో భేటీకి ముందు కేశవరావు తన నివాసంలో మంత్రి కె. జానారెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్లమెంటు సభ్యుడు రాజయ్య కూడా పాల్గొన్నారు. అందరూ ఐక్యంగా ఉంటేనే తెలంగాణ సాధ్యమని ఆయన అన్నారు.
తెలంగాణవాదులందరికీ తమ పార్టీ వేదిక అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు అన్నారు. తెలంగాణ నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు గురించి, ప్రజల మనోభావాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడే రాజకీయ నాయకులందరినీ తమ పార్టీ ఆహ్వానిస్తోందని ఆయన చెప్పారు. తెలంగాణవాదులంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.