భారత చట్టాలేం చేయలేవన్న కసబ్!: ఎకె47 తెలియదని
రెండేళ్ల క్రితం ప్రత్యేక కోర్టులో హాజరైన కసబ్ తాను ఉగ్రవాదిని కాదని చెప్పేందుకు ప్రయత్నించాడు. తనకు ముంబయి దాడులతో ఎలాంటి సంబంధం లేదని, తనకు ఎకె 47 అంటే ఏమిటో తెలియదని, కేవలం బాలీవుడ్ సినిమాలలో నటించేందుకే తాను భారత్ వచ్చానని జడ్జి ముందు పలికాడు. విచారణ అనంతరం కోర్టు అతడిని నేరస్తుడిగా పరిగణిస్తూ ఉరిశిక్ష ఖరారు చేసింది. జైలులో కూడా కసబ్ విచిత్రంగా ప్రవర్తించాడు.
తాను ఏ తప్పు చేయలేదని, తనకు ముంబయి ఘటనతో సంబంధం లేదని తొలుత చెప్పిన కసబ్ ఆ తర్వాత తప్పును అంగీకరించాడు. జైలులో ఉంటూ బిర్యానీ కావాలని డిమాండ్ చేశాడు. నన్ను ప్రేరేపించిన వారిని పట్టుకోవాలని, తనకు ఉరిశిక్ష వేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదన్నాడు. భారతదేశ చట్టాలు తనను ఏమీ చేయలేవని, అంతర్జాతీయ కోర్టులో విచారించాలని, ఇక్కడి న్యాయస్థానాలలో న్యాయం జరగదని వ్యాఖ్యానించాడు.
పలు సందర్భాలలో జడ్జిల ముందు మాటలు మార్చుతూ వచ్చాడు. మారణ హోమానికి తాను కారణమని చెప్పిన కసబ్ ఆ తర్వాత మేమే చేశామని చెబుతూ.. తన వెనుక పెద్ద గ్యాంగ్ ఉందని, సహచరుచు ఇస్మాయిల్ ముంబయి మారణకాండకు ప్లాన్ చేశాడని చెప్పుకొచ్చాడు. ఉరిశిక్ష పడ్డాక కొద్ది రోజులకు తనకు చావాలని లేదని, ఆ తర్వాత తనను చంపేయాలని లేదంటే పాక్లోని తన కుటుంబానికి ప్రమాదమని చెప్పేవాడు. ముంబయి దాడిని సమర్థించుకున్నాడు. తన పోలికలు ఉన్న ఉగ్రవాదిని చంపేశాకే తనను అరెస్టు చేశారని చెప్పాడు.