కసబ్ హీరో: షాక్కు గురైన లష్కరే తోయిబా, వార్నింగ్
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: 26/11 నిందితుడు అజ్మల్ కసబ్ ఉరిశిక్ష పైన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా స్పందించింది. లష్కరే తోయిబాకు చెందిన ఓ సీనియర్ కమాండర్ కసబ్ను హీరోగా అభివర్ణించారు. కసబ్ ఉరిశిక్షకు ప్రతిగా తాము భారత దేశంపై ప్రతీకారం తీర్చుకుంటామని లష్కరే తోయిబా హెచ్చరించింది. మరిన్ని దాడులు చేస్తామని ప్రకటించింది. కసబ్ను ఆదర్శంగా తీసుకోని దాడులు నిర్వహిస్తామని ఆ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. కసబ్ ఉరి పట్ల ఉగ్రవాద గ్రూపులు షాక్కు గురయ్యాయి.
మరోవైపు కసబ్ ఉరిశిక్షను అమలుపరిచిన నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో భద్రతను పెంచింది. నేవీ తీరం వెంబటి గస్తీని ముమ్మరం చేసింది. కేంద్రం ముఖ్య నగరాల్లో భద్రత సిబ్బందిని అప్రమత్తం చేసింది. కాగా కసబ్కు పూణేలోని ఎరవాడ జైలులో బుధవారం ఉదయం ఉరి తీసిన విషయం తెలిసిందే. ముంబై ఉగ్రవాద దాడుల్లో దోషిగా తేలిన కసబ్కు బుధవారం ఉదయం ఏడున్నర గంటలకు ఉరిశిక్ష అమలు చేశారు.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కసబ్ పెట్టుకున్న మెర్సీ పిటిషన్ను తోసిపుచ్చడంతో కసబ్ను ఉరితీశారు. కసబ్ మెర్సీ పిటిషన్ను రాష్ట్రపతి నవంబర్ 5వ తేదీన తోసిపుచ్చారు. రెండు రోజుల క్రితం రహస్యంగా కసబ్ను ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలు నుంచి పూణేలోని ఎరవాడ జైలుకు తరలించారు. కసబ్ను ఉరి తీసే వరకు మొత్తం ప్రక్రియ అంతా అతి రహస్యంగా జరిగింది. అతన్ని ఉరి తీసిన అనంతరం ఎరవాడ జైలులోనే ఖననం చేశారు.