బిల్డింగ్ పైనుండి దూకేస్తానని టిడిపి ఎమ్మెల్యే హంగామా
అవసరమైతే పైనుండి దూకుతానని హెచ్చరించారు. దీపం పథకంలో తన నియోజకవర్గానికి అన్యాయం జరుగుతోందన్నారు. దళితుడిని, ప్రతిపక్ష శాసనసభ్యుడిని కాబట్టే తన పట్ల వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. తమకు ఓట్లు వేసిన ప్రజలే అధికార పక్షానికి వేశారని, తమకు ఓటేసిన వారిని, వారికి ఓటేసిన వారిని వేర్వేరుగా చూస్తే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదన్నారు. ఓట్లు వేసి గెలిపించినప్పుడు ఆ ప్రజల బాధ్యత తన పైనే ఉంటుందన్నారు.
అందుకే తన నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయాలని భవనం పైకి ఎక్కినట్లు చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు తన వద్దకు వస్తున్నారన్నారు. మీ చేతులారా ఓ ఎమ్మెల్యేను పోగొట్టుకుంటారా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా చెడ్డ పేరు రావాలన్నా అధికారుల పని తీరు పైనే ఆధారపడి ఉంటుందన్నారు. అన్నపూర్ణగా పేరొందిన ఉభగోదావరి జిల్లాల్లోనే వరదలు వచ్చినప్పుడల్లా ఎక్కువ నష్టం జరుగుతోందన్నారు.
వర్షాల వల్ల భారీగా వచ్చే వరద నీరు ముందు మమ్మల్ని ముంచిన తర్వాతనే సముద్రంలో కలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వ్యవసాయ క్షేత్రాల నుండి నీరు అంతా వెలిసిపోయాక వచ్చి పంటలు ఎక్కడ మునిగాయని ప్రశ్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల జీవితాలతో ఆడుకోవద్దన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా కాసేపటికి అధికారులు నీలం తుఫాను బాధితులను ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే కిందకు దిగి వచ్చారు.