అజ్మల్ కసబ్ ఉరి: బిజెపికి చెక్ వయా నరేంద్ర మోడీ!?
గుజరాత్ అంటే మోడీ - మోడీ అంటే గుజరాత్గా మారిపోయింది. మోడీతో విభేదించి బిజెపిని పార్టీ సీనియర్ నేతలు వీడినప్పటికీ సర్వేలో మాత్రం మోడీ హవానే కొనసాగుతుందని చెప్పారు. సాధారణ ఎన్నికల్లో బిజెపినే మళ్లీ అధికారం కైవసం చేసుకుంటుందని సర్వేలు తెలిపాయి. బిజెపికి గట్టి పట్టున్న గుజరాత్ వంటి రాష్ట్రాన్ని తమ చేజిక్కించుకుంటే ఆ పార్టీ పరిస్థితి దేశవ్యాప్తంగా దారుణంగా తయారవుతుందని కాంగ్రెసు భావించి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమతున్నాయి.
ఇలా ప్రజల్లో తమ విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు, గుజరాత్ ఎన్నికల ద్వారా బిజెపిని దెబ్బతీసేందుకే కసబ్కు ఉరి శిక్ష అమలు చేసి ఉంటారని అంటున్నారు. భద్రతకు తాము ఎంతో ప్రాధాన్యం ఇస్తామని ప్రజలకు తేల్చిచెప్పాలని యూపిఏ ప్రభుత్వం భావించిందని, అందుకు కసబ్ ఉరిని ఓ అవకాశంగా తీసుకుని ఉండవచ్చునని చెబుతున్నారు. గోప్యంగా కసబ్ను ఉరితీయడం యూపిఏ రాజకీయ ఎత్తుగడలో భాగమే కావొచ్చంటున్నారు.
విదేశీ కుట్రలకు, దాడులకు భారత్ లక్ష్యంగా మారుతోందని, వీటిని అరికట్టడంలో యూపిఏ విఫలమవుతోందని నరేంద్ర మోడీ నిత్యం విమర్శిస్తుంటారు. వీటికి కౌంటర్ ఇవ్వడానికి, జాతీయ భద్రత విషయంలో తాము ఎంత దృఢంగా వ్యవహరించగలమో తెలియజేయడానికి కసబ్ ఉరిని యూపిఏ ఓ మార్గంగా ఎంచుకుందని అంటున్నారు. ఇది గుజరాత్ ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని కాంగ్రెసు భావించి ఉంటుందని చెబుతున్నారు.
అదే సమయంలో తమ దేశం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సంగతిని పాకిస్థాన్ గుర్తించేటట్టు చేయడంలో భారత్ విజయం సాధించిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద కసబ్ వ్యవహారంలో యూపిఏ ప్రభుత్వంలో పలురకాలుగు లాభపడింది. పారదర్శకంగా, నిష్పాక్షికంగా, చట్టబద్ధంగా కసబ్ కేసును విచారించడం, కసబ్కు కూడా న్యాయవాదిని, సలహాదారును ఏర్పాటు చేయడం వంటి విషయాలు అంతర్జాతీయంగా ఆకట్టుకున్నాయి.
మరో వైపు పార్లమెంట్ పై దాడి చేసిన కేసులో నిందితుడైన అఫ్జల్ గురు ఉరి విషయంపై కూడా ఫైళ్లు రాష్ట్రపతి భవన్ నుంచి హోంశాఖకు చేరింది. దేశం కోసం కాంగ్రెస్ కఠిన నిర్ణయాలు తీసుకున్నదన్న సంకేతాల వల్ల మధ్యంతర ఎన్నికలకు సిద్దపడవచ్చునని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. శీతాకాల సమావేశాలను కూడా దీని ద్వారా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చునని కాంగ్రెసు భావించి ఉంటుందని అంటున్నారు.