తృణమూల్ అవిశ్వాస నోటీసు: వేడి రగిల్చిన టి-ఎంపీలు
కాగా సమావేశాల ప్రారంభాలకు ముందు తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అవిశ్వాస తీర్మానంపై నోటీసును లోకసభ స్పీకర్ మీరాకుమార్కు ఇచ్చింది. ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ ఎఫ్డిఐలపై ఓటింగ్ కోసం నోటీసులు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో ఎఫ్డిఐలపై వోటింగ్కు నోటీసులు ఇచ్చింది.
పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ప్రజా సమస్యల చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రతిపక్షాలు తమతో కలిసి రావాలని సూచించారు. సమావేశాలు ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే విధంగా కొనసాగుతాయని అభిప్రాయపడ్డారు. చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వల్ల కలిగే లాభాలను గుర్తించాలన్నారు.
కాగా 184వ నిబంధన కింద చర్చ, ఓటింగ్కు కోరుతూ ప్రతిపక్షాలు స్పీకర్కు 20 నోటీసులు ఇచ్చాయి. బిజెపి 13, జెడి(యు) 2, సిపిఎం 2, సిపిఐ 1, తృణమూల 1, టిడిపి 1 ఇచ్చాయి. కాగా చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై బిజెపి సహా ఇతర ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా పడ్డాయి.
ప్రారంభానికి ముందే తెలంగాణ వేడి, ఎంపీలు గైర్హాజరు
తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు సమావేశాల ప్రారంభానికి ముందే వేడి పుట్టించారు. ఒకటో నెంబరు గేటు వద్ద ఎంపీలు తెలంగాణ కోరుతూ ఆందోళన నిర్వహించారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటేనే తాము సమావేశాలకు హాజరవుతామని వారు చెప్పారు. జై తెలంగాణ అంటూ గేటు వద్ద వారు నినాదాలు చేశారు.
పార్లమెంటులో వెంటనే తెలంగాణ బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజయ్య, మంద జగన్నాథం, మధుయాష్కీ, జి.వివేక్లు పార్లమెంటు ఆవరణలోనే బైఠాయించారు.