షర్మిలది రాక్షసానందం, లోకజ్ఞానం లేదు: శోభారాణి
తాను మహిళగా మాట్లాడితే బాగుండదనిస తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ఇంటి దగ్గర ఆయన గ్లాసులో ఐసు కలుపుతూ కూర్చుని ఉద్యోగ సంఘాల నాయకులతో ములాఖతులు పెట్టిస్తున్నట్లుందని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబుకైతే నిరసనలు, షర్మిలకైతే రెడ్ కార్పెట్, ఇదేనా వారి తీరు అని ఆమె అడిగారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చెల్లెలు షర్మిల తన తండ్రి కోసం చనిపోయిన వారిని చూసి గర్వ పడుతున్నానంటూ రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. మరణించినవారి కోసం బాధపడాలి గానీ చనిపోయిన వారిని చూసి గర్వపడటం ఏమిటని ఆమె అడిగారు. తనకు సర్వం తెలుసన్నట్లు మాట్లాడుతున్న షర్మిల కాస్త లోకజ్ఞానంతో వ్యవహరిస్తే బాగుంటుందని శోభారాణి హితవు పలికారు.
పాదయాత్ర సందర్భంగా తెలంగాణలో అడుగు పెట్టిన తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో షర్మిల చేసిన తొలి ప్రసంగాన్ని ఆమె ఈ సందర్భంగా మీడియా ముందు ప్రదర్శించారు. జలయజ్ఞం పనులు తెలంగాణలోనే బాగా చేశామని, పోలవరం వంటి ప్రాజెక్టులు చేపట్టామని షర్మిల అంటున్నారని, షర్మిలకు ఎల్లలు తెలియవని, ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో.. ఏ ప్రాజెక్టుపై ఏ ప్రాంతం వారి మనోభావాలు ఎలా ఉన్నాయో తెలియవని శోభారాణి అన్నారు.
తెలంగాణకు పోలవరానికి ఏమైనా సంబంధం ఉందా? అని ఆమె అడిగారు. పోలవరం గురించి చెప్పి.. తెలంగాణలో పనులు బాగా చేశామని ఆమె చెబితే వింటున్న ప్రజలు నవ్వాలా...ఏడవాలా? షర్మిల మాటలకు అదే వాహనంలో ఆమె వెనుక నిలబడిన జిట్టా బాలకృష్ణారెడ్డి వంటి తెలంగాణ నేతలు నవ్వుకొంటున్నారని, అదీ ఆమె పరిస్ధితి అని శోభారాణి అన్నారు.