బాబుకు వైఎస్ జగన్ భయం: ఎర్రన్న కొడుక్కీ ఛాన్స్?
హైదరాబాద్/శ్రీకాకుళం: పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు మృతితో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు శ్రీకాకుళం జిల్లాలో కొత్త చిక్కు వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఎర్రన్న స్థానంలో పోలిట్ బ్యూరోలోకి తీసుకునే వారిపై పార్టీలో చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎర్రన్నాయుడు ఉన్నన్ని రోజులు శ్రీకాకుళం జిల్లా టిడిపిలో ఆయన హవానే కొనసాగింది. తమ్మినేని సీతారం, కళా వెంకట్రావు వంటి నేతలు ఉన్నప్పటికీ ఎర్రన్నాయుడు జిల్లా టిడిపికి పెద్ద దిక్కుగా ఉండేవారు.
ఎర్రన్నాయుడు తనయుడు కింజారపు రామ్మోహన్ నాయుడు తాను రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించారు. రాజకీయ పరిణితి సాధించే వరకు సీనియర్ల సూచనల మేరకు పని చేస్తానని చెప్పారు. సీనియర్లు అంటే రామ్మోహన్ నాయుడు తన తండ్రికి అండగా నిలబడిన అచ్చెన్నాయుడు, ఇతర నేతల సలహాలు, సూచనల మేరకే నడిచే అవకాశాలు ఉన్నాయి. కానీ కిమిడి కళా వెంకట్రావు, తమ్మినేని సీతారం వంటి నేతల సూచనలు పాటించే అవకాశాలు లేవంటున్నారు. అనుభవం లేని కారణంగా రామ్మోహన్ నాయుడుని ఇప్పటికిప్పుడు పోలిట్ బ్యూరోలోకి తీసుకునే అవకాశాలు లేవని అంటున్నారు. అయితే జిల్లా పార్టీలో మాత్రం కీలక పాత్ర పోషించేనున్నారని అంటున్నారు.
హీరో నందమూరి బాలకృష్ణ శ్రీకాకుళం వెళ్లినప్పుడు జిల్లా టిడిపి బాధ్యతను అచ్చెన్నాయుడు భుజాలపై వేశారు! అచ్చెన్నాయుడు పార్టీని చూసుకోవాలని ఆయన ఎర్రన్నాయుడు లెవంత్ డే కార్యక్రమానికి వెళ్లినప్పుడు చెప్పారు. అచ్చెన్నాయుడును పోలిట్ బ్యూరోలోకి తీసుకునే అవకాశాన్ని కొట్టి పారేయలేమంటున్నారు.
జిల్లాకు చెందిన సీనియర్ నేతలు కళా వెంకట్రావు, తమ్మినేని సీతారాంలు తమను పోలిట్ బ్యూరోలోకి తీసుకొని పక్షంలో అసంతృప్తికి లోనయ్యే అవకాశముంది. అయితే గతంలో చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించినప్పుడు పార్టీని మార్చినందు వల్ల వారిని తీసుకునే ముందు ఆలోచించే అవకాశముందని అంటున్నారు.
ఎర్రన్న స్థానంలో పోలిట్ బ్యూరోలోకి తీసుకునే అంశం చంద్రబాబుకు పెద్ద చిక్కునే తీసుకు వచ్చేలా ఉందంటున్నారు. ఎర్రన్న మృతి చెందినప్పటికీ ఆయన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వని పక్షంలో ఆ వర్గం బాబుపై తమ అసంతృప్తిని వెల్లగక్కే అవకాశాలు మెండు. ఎందుకంటే ఇన్నాళ్లు జిల్లా టిడిపిలో ఎర్రన్న వర్గానిదే హవా. అదే సమయంలో కళా, తమ్మినేని వంటి సీనియర్లను పక్కన పెట్టినా ఇబ్బందులు తప్పవని అంటున్నారు.
ఇప్పటికే 2008లో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి ఆ తర్వాత తిరిగి టిడిపిలోకి వచ్చిన తమ్మినే, కళాలు తమను విస్మరిస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు చూసే అవకాశాలు లేకపోలేదంటున్నారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని బాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
ఆయన తర్వాతనే తమ్మినేని, కళాల పేర్లు వినిపిస్తాయి. ఆయితే ఎర్రన్నాయుడులాగే వారిద్దరూ పార్టీలో సీనియర్ నేతలు. ఎర్రన్నాయుడు కీలక నేత కావడంతో వారికి పోలిటి బ్యూరోలో అవకాశం రాలేదు. అయితే ఇప్పుడు ఆయన మృతితో వారిద్దరిలో ఎవరికైనా జిల్లా నుండి పోలిట్ బ్యూరోలో అవకాశం దక్కుతుందా లేక ఎర్రన్న వర్గానికి చెందిన వారికే దక్కుతుందా అనే చర్చ టిడిపిలో ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా కార్యకర్తల్లో జరుగుతోంది.
ఎర్రన్న తనయుడు రామ్మోహన్ నాయుడుకు పోలిట్ బ్యూరోలో అవకాశం ఇస్తే జిల్లాకు చెందిన సీనియర్లు అసలు అంగీకరించరు. ఎర్రన్న తనయుడు అచ్చెన్నాయుడుకు ఇచ్చినా అంగీకరించక పోవచ్చునని అంటున్నారు. జిల్లా టిడిపిలో ఎర్రన్న హవా కొనసాగినా అదంతా అచ్చెన్నాయుడే దగ్గరుండి చూసుకునే వాడు. హీరో నందమూరి బాలకృష్ణ కూడా ఇటీవల శ్రీకాకుళం వచ్చినప్పుడు పార్టీని చూసుకోవాల్సిన బాధ్యత అచ్చెన్నాయుడు పైన ఉందని చెప్పారు. అంటే ఆయన మద్దతు ఎర్రన్న ఫ్యామిలీకే ఉండవచ్చునని అంటున్నారు.
అయితే సీనియర్లం అయిన తమను విస్మరిస్తే కళా వెంకట్రావు, తమ్మినేని సీతారాంలు కూడా ఊరుకుండరని చెబుతున్నారు. అయితే పార్టీలు మారిన చరిత్ర ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తే ఎర్రన్నాయుడు వర్గం ఊరుకోకపోవచ్చుననే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. చంద్రబాబు... కళా వైపు మొగ్గు చూపిస్తారా, తమ్మినేనికి అవకాశం ఇస్తారా, ఎర్రన్నాయుడు వర్గాన్ని మరోసారి అందలం ఎక్కిస్తారా చూడాలి.