బాబుయాత్రపై సాక్షి: ప్రెస్ కౌన్సిల్కు వెళ్తామని హెచ్చరిక
దీనిపై టిడిపి నేత పెద్దిరెడ్డి సోమవారం మాట్లాడారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర నిలిపివేయనున్నట్లు ఆధారం లేకుండా రాసిన వార్తను ఖండిస్తూ అంతే పరిమాణంలో వాస్తవాలను ప్రచురించాలని... లేకుంటే సాక్షి పత్రికపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పెద్దిరెడ్డి హెచ్చరించారు. సాక్షి ప్రధాన సంపాదకులకు పెద్దిరెడ్డి లేఖ రాశారు. బాబు యాత్రపై నిరాధార కథనం వచ్చిందని, దానిని ఖండిస్తూ వార్తను ప్రచురించాలన్నారు.
కాగా బాబు యాత్రకు ఫుల్స్టాప్ శీర్షికతో సోమవారం కథనం వచ్చింది. వస్తున్నా మీకోసం నీరసించి పోతున్నదని, నేతలు పట్టించుకోవడం లేదని, కార్యకర్తల్లో ఉత్సాహం కొరవడిందని, బస్సు యాత్రపై సన్నిహితులు సమాలోచనలు చేస్తున్నారని ప్రచురించింది. దీని పైన పెద్దిరెడ్డి ఖండన వార్తను ప్రచురించాలని సాక్షికి లేఖ రాశారు.
కుర్చీ కోసమే
రాష్ట్రంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్ల అక్రమార్జనకు పాల్పడి ప్రజాధనాన్ని లూటీ చేసి జైలులో ఊచలు లెక్కిస్తున్న జగన్ ముఖ్యమంత్రి కుర్చీ కోసమే పాట్లు పడుతున్నారని మాజీ ఎంపీ కాల్వ శ్రీనివాసులు కర్నూలు జిల్లాలో విమర్శించారు. సోమవారం కర్నూలు జిల్లా శ్రీశైల నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి శిల్పా చక్రపాణి రెడ్డి తలపెట్టిన పాదయాత్ర మహానంది నుంచి ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాసులు ప్రసంగిస్తూ, రాష్ట్రంలో వైయస్ హయాంలో అవినీతి తాండవమాడిందనీ, రాజ్యాంగ వ్యవస్థ పూర్తిగా నాశనమైందని చెప్పారు. రాష్ట్రంలో అన్నివర్గాల వారికి న్యాయం జరగాలంటే తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు.