29ననే ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి రాజీనామా
ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించేందుకు వీలుగా 30న శాసనసభ ప్రత్యేకంగా సమావేశం కానున్న నేపథ్యంలో స్పీకర్ అందుబాటులో ఉంటారని, అందువల్ల ఆ రోజున తాను స్పీకర్ మనోహర్ను కలసి రాజీనామా సమర్పిస్తానని ఆయన ఓ ప్రముఖ తెలుగు దినపత్రికతో చెప్పారు. తాను ఒక్కడినే రాజీనామా చేస్తానని, తన వెంట ఐదుగురు ఎమ్మెల్యేలొస్తారని తానెప్పుడూ చెప్పలేదని అన్నారు.
తాను అసెంబ్లీ సభ్యత్వానికి మాత్రమే రాజీనామా చేస్తానని, పార్టీకి కాదని పెద్దిరెడ్డి వివరించారు. దిగ్విజయ్ సింగ్తో సహా పలువురు ఢిల్లీ పెద్దలకు రాష్ట్ర రాజకీయ పరిణామాలను వివరించానని చెప్పారు. తన రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే పుంగనూరు ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని పెద్దిరెడ్డి భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డికి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి దశాబ్దాల రాజకీయ వైరం ఉంది.
పుంగనూరులో వైఎస్ఆర్, రోశయ్య హయాంలో మంజూరైన అభివృద్ధి పనులకు అనుమతులు, నిధులు ఇవ్వకుండా కిరణ్ సర్కార్ అడ్డుపుల్ల వేస్తూ వచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య వైరం తారస్థాయికి చేరింది. కిరణ్ సీఎం అయిన రోజు నుంచి ఆయన్ను కుర్చీ నుంచి దించుతానని పెద్దిరెడ్డి చెబుతూ వస్తున్నారు.
సంక్రాంతిలోపు సీఎం కుర్చీ విషయంలో ఏమైనా మార్పులుంటే పెద్దిరెడ్డి మరి కొంతకాలం కాంగ్రెస్లో ఉండే అవకాశం ఉంది. లేకపోతే జనవరి మూడోవారంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిపోవచ్చని పరిశీలకుల అంచనా అంటూ ఆ తెలుగు దినపత్రిక వ్యాఖ్యానించింది.