పెద్దిరెడ్డి రాజీనామా: ఇదీ కిరణ్ పాలన అన్న జగన్పార్టీ
కిరణ్ రెండేళ్ల పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థమవుతోందన్నారు. కాంగ్రెసు పార్టీలో భవిష్యత్తు లేదనే ఆ పార్టీ శాసనసభ్యులు అందరూ ఆ పార్టీకి దూరమవుతున్నారని అన్నారు. కిరణ్ పాలనలో ఎమ్మెల్యేలు అందరూ ఆ పార్టీని విడిచి బయటకు రావడం ఖాయమన్నారు. కిరణ్ పాలన పట్ల సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే సంతృప్తిగా లేరని భూమన కరుణాకర్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.
కాగా పెద్దిరెడ్డి ఈ రోజు తన రాజీనామాను స్పీకర్ నాదెండ్ల మనోహర్కు సమర్పించిన తర్వాత ఆయన కిరణ్ కుమార్ రెడ్డి పైన నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. సమర్థుడు కాని వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారన్నారని విమర్శించారు. 33 ఏళ్లుగా కాంగ్రెసు పార్టీలో కొనసాగుతున్నానని, అసమర్థ కిరణ్ కారణంగా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. కిరణ్ స్పీకర్ నుండి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారని, ఆయనకు మంత్రిగా పని చేసిన అనుభవం లేదని, అలాంటి వ్యక్తి సమర్థవంతంగా ఎలా పని చేయగలడని ప్రశ్నించారు.
పార్టీ కోసం పని చేయని వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేశారన్నారు. తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం తనను మనస్తాపానికి గురి చేసిందన్నారు. కాంగ్రెసు కిరణ్ సొంత పార్టీ కాదని, తన నియోజకవర్గానికి చివరకు మంచి నీటిని కూడా అడ్డుకుంటున్నారన్నారు. తెలంగాణ, సమైక్యవాదం అంటూ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన సమయంలో కిరణ్ పదే పదే ఢిల్లీకి తిరిగి ముఖ్యమంత్రి అయ్యాడని మండిపడ్డారు.
సిఎం కిరణ్ కిషోర్ రాజ్యాంగేతర శక్తిగా ఉన్నాడన్నారు. ప్రభుత్వ ఖజానాకు కిరణ్ గండి కొడుతున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరపలేని అసమర్థుడు ముఖ్యమంత్రి అన్నారు. నియోజకవర్గ పునర్విభజన తర్వాత నుండి తనపై కుట్ర చేస్తున్నాడని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రికి పెద్దిరెడ్డి ఆరుపేజీల లేఖ రాశారు.