కుప్పం మే సవాల్: బాబుతో జగన్ భార్య భారతి ఢీ?
కుప్పంలోనే కాదు, చంద్రబాబు మరో నియోజకవర్గంలో పోటీ చేసినా అక్కడ కూడా భారతినే పోటీకి దించుతారని అంటున్నారు. గడువుకన్నా ముందే ఎన్నికలు వస్తాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అంచనాలు వేస్తోంది. దాంతో అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తు జరుగుతున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబుపై పోటీకి భారతిని దించి ప్రచారం కూడా పెద్ద యెత్తున నిర్వహించాలని అనుకుంటున్నారు. కుప్పం నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ భారతి, వైయస్ విజయమ్మ, షర్మిల వెళ్లి ఓట్లు అడుగుతారని అంటున్నారు.
కాగా, వైయస్ జగన్ జైలుకు వెళ్లి ఆరు నెలలు ముగిసింది. తాను పెట్టుకున్న స్టాట్యుచరీ బెయిల్ పిటిషన్ను సిబిఐ కోర్టు తిరస్కరించడంతో జగన్ హైకోర్టులో అదే పిటిషన్ దాఖలు చేశారు. మరో బెయిల్ పిటిషన్పై సిబిఐ కోర్టులో శుక్రవారం వాదనలు ముగిశాయి. అయితే, జైలు నుంచే వైయస్ జగన్ వ్యూహాలను రచిస్తున్నారనే మాట వినిపిస్తోంది. పార్టీలో సమీకరణాలు కూడా పెద్ద యెత్తున మారినట్లు చెబుతున్నారు.
పార్టీ వ్యవహారాల్లో పెద్ద యెత్తున కనిపించిన కొంత మంది నేతలకు కళ్లెం వేసినట్లు తెలుస్తోంది. వైవి సుబ్బారెడ్డి సమీకరణాల మార్పులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుకు ప్రాధాన్యం తగ్గించినట్లు చెబుతున్నారు. అదే విధంగా జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డిని పక్కన పెట్టి ఆయన సోదరుడు నారాయణ రెడ్డికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతున్నారు.
కాగా, సాక్షి మీడియాను భారతి పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకున్నట్లు చెబుతున్నారు. ఆమె ప్రస్తుతం దానికి మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ప్రతి రోజూ సాక్షి కార్యాలయానికి వచ్చి వ్యవహారాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. తెలంగాణకు చెందిన కాంగ్రెసు, తెలుగుదేశం నాయకులు పలువురు తమ పార్టీలోకి వస్తారని వైయస్సార్ కాంగ్రెసు నాయకులు నమ్ముతున్నారు.