జైపాల్ రెడ్డీ కాంగ్రెసును వీడుతారు: దామోదర్ రెడ్డి
తెలంగాణ ఉద్యమం నివురు గప్పిన నిప్పులా ఉందని ఆయన అన్నారు. ప్రస్థుత పరిస్థితుల్లో రాజకీయంగానే నిర్ణయాలు తీసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణవాదం వినిపించే పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని ఆయన చెప్పారు. డిసెంబర్ 9వ తేదీలోగా ఓ స్పష్టత వస్తుందని అన్నారు. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలంగా ఉందని అంటున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సూర్యాపేట నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. తెలంగాణపై తేల్చకపోతే రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోతుందని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే ఈ నెలల ఢిల్లీ మొదలుకుని గల్లీ వరకు తెలంగాణ కాంగ్రెసు నాయకులు పార్టీని విడే అవకాశాలున్నాయని ఆయన అన్నారు.
తెలంగాణ ఫ్రంట్ మీద వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని పలువురు తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఆలోచన చేస్తున్నారని ఆయన అన్నారు. పిసిసి అధ్యక్ష పదవి కోసం రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు ప్రయత్నిస్తున్నారని, కెవిపి పిసిసి అధ్యక్షుడైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సులువు అవుతుందని ఆయన అన్నారు.