జగన్ హామీ లేనివారే టిడిపిలో ఉన్నారు: చిన్నం
తెలుగుదేశం సీమాంధ్ర నాయకులు వైయస్సార్ కాంగ్రెస్లో, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలుగుదేశం పార్టీకి నాయకులుంటే ఓటర్లు లేరనీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు ఉన్నారు కానీ బలమైన నాయకత్వం లేదని అన్నారు.
పార్టీ మారుతున్నవారిని అమ్ముడు పోతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజమెంతో ఆయనే చెప్పాలని చిన్నం అన్నారు. తనకు రాత్రికి రాత్రే టికెట్ ఇచ్చారనీ, ఎంతకు కొన్నారో బాబు చెప్పాలని ఆయన అడిగారు. ప్రజల మద్దతు లేని బాబు వైపు ఉండలేకనే పార్టీ మారానని అన్నారు. చిన్నం రామకోటయ్య వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, టికెట్పై స్పష్టమైన హామీ లేకపోవడం వల్లనే ఆయన ఆగిపోయినట్లు కూడా అప్పట్లో ప్రచారం జరిగింది.
ఇలావుండగా, టిఆర్ఎస్ ఎమ్మెల్యే తారక రామారావు, ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్, టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ శుక్రవారం అసెంబ్లీ లాబీలో కొద్ది సేపు చర్చించుకున్నారు. కేశవ్ ఎప్పుడూ లేని విధంగా రాయలసీమలో కనిపించే అడ్డపంచెతో రావడంతో దాని గురించి మాట్లాడుకున్నారు. మా ప్రాంతం సంస్కృతిని ప్రతిబింబించే విధంగా అడ్డపంచె కట్టుకున్నట్టు కేశవ్ తెలిపారు.