నార్వే తెలుగు దంపతులు: చేతులెత్తేసిన ఇండియా
కుమారుడి పట్ల దురుసుగా ఆరోపణలతో నార్వేలో అరెస్టయిన తెలుగు దంపతులపై నార్వే అధికారులుఅభియోగాలు మోపారు. వారిలో ఏడాది మూడు నెలలు తల్లికి, ఏడాదిన్నర తండ్రికి జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరింది. దంపతులను కస్టడీకి రిమాండ్ చేసినట్లు ఓస్లో పోలీసులు చెప్పారు. కేసు కోర్టు విచారణలో ఉంది. డిసెంబర్ 3వ తేదీన తీర్పు వెలువడే అవకాశం ఉంది.
హైదరాబాద్ నగరానికి చెందిన చంద్రశేఖర్, అనుపమ దంపతులను నార్వే పోలీసులు అరెస్టు చేశారు వి.చంద్రశేఖర్ టిసిఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్)కు చెందిన కంపెనీలో ఉద్యోగి. అతని భార్య అనుపమ. చంద్రశేఖర్ ఓస్లోలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తమ అబ్బాయి పదే పదే స్కూలు నుంచి ఇతరుల బొమ్మలు తెస్తుండటంతో చంద్రశేఖర్ అతడిని మందలించారు. దానిపై ఆ అబ్బాయి తన పాఠశాలలోని ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేయడమే కాక.. తిరిగి భారత్కు పంపేస్తామని బెదిరిస్తున్నట్లు కూడా వారికి చెప్పాడని చంద్రశేఖర్ తమ్ముడి కొడుకు శైలేందర్ తెలిపారు.
దీనిపై విచారించిన అక్కడి అధికార వర్గాలు చంద్రశేఖర్, అనుపమలు తమ పిల్లవాడికి చెమ్చాకు బదులు చేత్తో అన్నం పెడుతున్నారని, ఇలా అనేక రకాల తప్పులను ఎత్తి చూపారు. అయితే తాము అన్ని తప్పులు చేసినట్లు ఆ దంపతులకు తెలీదు. కానీ తొమ్మిది నెలల తర్వాత దంపతులిద్దరూ అరెస్టయ్యారు.
తమ బాబాయికి అసలు కేసు గురించి తెలియదని, తమ పిన్నిని, పిల్లలను తీసుకుని జూలైలో హైదరాబాద్ వచ్చి, తిరిగి అక్టోబర్ చివరి వారంలో ఓస్లో తిరిగి వెళ్లారని, అప్పుడే భార్యతో సహా తమ ముందు హాజరు కావాల్సిందిగా అక్కడి అధికారులు నోటీసు ఇచ్చారని శైలేందర్ చెప్పారు.