ములాయంకు 11 లక్షలతో గుడి: ప్రధాని పదవిపై వ్యాఖ్య
లక్నో: సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్కు అభిమానులు గుడి కడుతున్నారు. ఇప్పటి వరకు రాజకీయ నాయకులు, సినీ నటులపై ప్రేమతో అభిమానులు దేవాలయాలు నిర్మించడం తమిళనాడులో జరిగేది. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్కు అది పాకింది. ములాయం అభిమానులు ఆయన పేరిట ఓ దేవాలయాన్ని రూ.11 లక్షలతో నిర్మిస్తున్నారు. ములాయం పుట్టిన రోజును పురస్కరించుకొని నవంబర్ 22న ఆలయ పనులు మొదలు పెట్టారు.
ఈ నేపథ్యంలో హనుమంతుడికి చాలీసా మాదిరిగా ములాయంపై భక్తితో రాయించిన సమాజ్వాదీ చాలీసాను పార్టీ నవంబర్ 22న విడుదల చేసింది. ఈ చాలీసాను సంకేత్ కవిగా పేరున్న హోమియో వైద్యుడు, కవి కమ్తా ప్రసాద్ కేసరి రాశారు. అయితే సమాజ్వాది పార్టీ, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాత్రం గుడిని వ్యతిరేకిస్తున్నారు. గుడికి, ప్రభుత్వానికి, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పార్టీ తెలిపింది. గుడికి ప్రభుత్వం నుండి ఎలాంటి డబ్బు అందదని చెప్పింది.
మరోవైపు ములాయం సింగ్ ప్రధాన పదవిపై తన మనసులోని మాటను బయటపెట్టాడు. ప్రధాని రేసులో లేనంటూనే అవకాశమొస్తే అంటూ చెప్పాడు. మాజీ గవర్నర్ ఎన్డీ తివారీతో కలిసి ఆదివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రధాని పదవి రేసులో తాను లేనని, అవకాశం వస్తే కాదనబోననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోటీలో తాను లేనన్నారు. గతంలో యుపి ముఖ్యమంత్రి పదవికి కూడా పోటీలే తాను లేనని చెప్పారు.
అయితే పరిస్థితులే తనకు ఆ పదవిని కట్టబెట్టాయన్నారు. ఏదైనా పరిస్థితుల పైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. తివారీ మాట్లాడుతూ.. వచ్చే లోకసభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, అందుకు తన వయస్సు సహకరించదని చెప్పారు. ఇప్పుడు తన వయస్సు 88 అని, 2014లో జరిగే ఎన్నికలకు వయస్సు సహకరించదన్నారు. కాంగ్రెసుకు గుడ్ బై చెప్పే విషయం, రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారా అన్న ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చేందుకు ఇష్టపడలేదు.