టిడిపి ఉచ్చు: జగన్ పార్టీపై మాలల మండిపాటు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓ విషవృక్షమని వ్యాఖ్యానిస్తూ ఆ పార్టీలోని మాలలు బయటి రావాలని కోరారు. తెలుగుదేశం ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ మాలమహానాడు ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాదులోని లోయర్ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జెండాలను దహనం చేశారు.
వర్గీకరణకు మద్దతు పలికి తన నిజస్వరూపాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బయటపెట్టిందని, మాలల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని కారెం శివాజీ విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి జీవించినంత కాలం మాలల జీవితాలతో చెలగాట మాడారని ఆయన అన్నారు.
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగను వెంటపెట్టుకొని ఢిల్లీకి తీసుకెళ్లి వర్గీకరణ లక్ష్యంతో ఉషామెహ్రా కమిషన్ను నియమించారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ బిల్లు అమలు కోసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డికి శివాజీ కృతజ్ఞతలు తెలిపారు.