ఒత్తిడి-జంప్?: కెసిఆర్తో ముగ్గురు ఎంపీల మంతనాలు
కెసిఆర్తో వీరి భేటీ హైదరాబాదులో, న్యూఢిల్లీలో రాజకీయ వేడిని రాజేసింది. వీరి భేటీ వెనుక వ్యూహమేమిటో అనే చర్చ కాంగ్రెసులో ప్రధానంగా జరుగుతోంది. రేపు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డిఐ) లోకసభలో ఓటింగ్ జరగనుంది. టి-ఎంపీలను కేంద్రమంత్రులు కమల్ నాథ్, సుశీల్ కుమార్ షిండేలు బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి తీసుకుంటే తప్ప తాము ఓటింగులో పాల్గొనబోమని వారు తేల్చి చెప్పారు.
అదే సమయంలో వారు కెసిఆర్తో భేటీ కావడం గమనార్హం. ఎఫ్డిఐ ఓటింగ్ నేపథ్యంలో పార్టీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేచ్చే వ్యూహంలో భాగంగా వీరు భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఓటింగుకు హాజరు కావొద్దని, అలా అయితేనే కేంద్రం దిగి వస్తుందని కెసిఆర్ వారికి చెప్పినట్లుగా తెలుస్తోంది. పలువురు ఎంపీలు తెరాస వైపు వెళ్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా వారు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కేంద్రం డిసెంబర్ 9లోపు తెలంగాణపై తేల్చకుంటే తమ దారి చూసుకుంటామని పలువురు ఎంపీలు ఇప్పటికే హెచ్చరించారు. కె కేశవ రావు కూడా తమకు తామే డెడ్ లైన్ విధించుకుంటున్నామని, అధిష్టానానికి విధించడం లేదని కెసిఆర్తో భేటీ అనంతరం ఇటీవల చెప్పారు. వారు విధించిన డెడ్ లైన్ దగ్గర పడటం, ఎంపీలు కేసిఆర్తో భేటీ కావడం కాంగ్రెసులో ప్రకంపనలు సృష్టిస్తోంది.
కాంగ్రెసు తెలంగాణపై తేల్చని పక్షంలో పలువురు ఎంపీలు తెరాస వైపు వెళ్తారని, కొత్త ఫ్రంట్తో బరిలోకి దిగుతారనే వివిధ రకాల ప్రచారం జరుగుతోంది. అయితే కొత్త ఫ్రంట్ వైపు మొగ్గుచూపి తెరాసతో కలిసి పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
కాగా భేటీ అనంతరం వివేక్ మీడియాతో మాట్లాడారు. కెసిఆర్తో భేటీ మర్యాద పూర్వకమే అన్నారు. భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, తెలంగాణ అంశంపై భేటీలో చర్చించినట్లు చెప్పారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకే వచ్చారని అన్నారు. ఉద్యమంలో ఎలాంటి పాత్ర పోషించాలనే విషయమై చర్చించినట్లు చెప్పారు. అయితే రాజకీయ కోణం లేదన్నారు.