బాబుకు ప్యాకేజ్: బాలినేని, 'కెసిఆర్ హెలికాప్టర్ ప్రచారం'
తమ పార్టీ నేత షర్మిల పైన తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు చవకబారు విమర్సలు చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మహబూబ్ నగర్ జిల్లాలో అన్నారు. షర్మిలవి జర్మనీ బూట్లని వారు చెబుతుంటే బాబు నుంచి అబద్దాలను ఆడటంలో వారు ఎంతగా తర్ఫీదు పొందారో అర్థమైపోతోందన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓ వర్గం మీడియా మద్దతు పలుకుతూ తమపై అవాస్తవాలు ప్రచారం చేస్తోందన్నారు.
కెసిఆర్పై గోనె
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు లేదా ఆయన తనయుడు కల్వకుంట్ల తారక రామారావు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తనపై పోటీకి సిద్ధమా అని సవాల్ విసిరారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా హెలికాప్టర్ ద్వారా ప్రచారం చేసిన ఘనత కెసిఆర్ది అన్నారు. జగన్ను కలిసి తెలంగాణ అంశంపై చర్చిస్తామన్నారు. ఉద్యమం పేరిట కెసిఆర్ కుటుంబ సభ్యులు అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు.
తెరాస నేతలు జగన్ పైన ఆరోపణలు మానివేసి ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పించాలన్నారు. తెలంగాణపై అఖిల పక్ష సమావేశమని చెప్పి కాంగ్రెసు పార్టీ మరో మోసానికి తెరలేపిందన్నారు. మొదట తెలంగాణపై కాంగ్రెసు పార్టీ తమ అభిప్రాయం చెప్పాకే ఇతర పార్టీల అభిప్రాయాలని అడగాలని డిమాండ్ చేశారు.
అంబేడ్కర్కు నివాళి
అంబేడ్కర్కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ గురువారం పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించారు. మనుషుల మధ్య అసమానతలను తొలగించేందుకు అంబేడ్కర్ కృషి చేశారన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అజెండా అంబేద్కర్ ఆశయాలే అన్నారు.