ఏం చెప్పాయి, ఏం చెప్తాయి?: జగన్కు చిక్కు చిరు సేఫ్
న్యూఢిల్లీ: తెలంగాణపై ఈ నెల 28వ తేదిన అఖిలపక్ష సమావేశానికి కేంద్రం ఒకే చెప్పడంతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఏ పార్టీకి ఆ పార్టీ తెలంగాణపై ఏం చెప్పాలో అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీ, సిపిఎం, సిపిఐ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు తెలంగాణపై స్పష్టమైన వైఖరితో ఉండగా, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం, మజ్లిస్ పార్టీలు ఇప్పటి వరకు నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పలేదు.
ఇన్నాళ్లు అఖిలపక్షం కోసం డిమాండ్ చేసి కాంగ్రెసును బోనులో నిలబెట్టిన చంద్రబాబు ఇప్పుడు మల్లగుల్లాలు పడుతున్నారు. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని తెలంగాణ జిల్లాల్లో వస్తున్నా మీకోసం పాదయాత్రతో అడుగు పెట్టిన చంద్రబాబు అఖిలపక్ష సమావేశంలోనూ అదే చెప్పనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఓకే చెప్పకుండా, నో చెప్పకుండా తాము వ్యతిరేకం అని చెప్పే అవకాశాలు ఉన్నాయి. తద్వారా నిర్ణయాన్ని కేంద్రం పైనే వేయనున్నారు. ప్రస్తుతం బాబు, షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు. అఖిల పక్ష సమావేశం వారు తెలంగాణలో ఉన్నప్పుడు జరగనుంది.
వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా టిడిపి చెప్పినట్లుగానే చెప్పే అవకాశాలు ఉన్నాయి. తాము వ్యతిరేకం కాదని, నిర్ణయం కేంద్రమే తీసుకోవాలని చెప్పవచ్చు. తెలంగాణవాదులు నిర్ణయాన్ని స్పష్టంగా తెలియజేయాలని చెబుతున్నారు. లేదంటే తెలంగాణ వ్యతిరేకులుగానే పేర్కొంటామంటున్నారు. 'యస్' 'నో' కాకుండా కేంద్రంపై నిర్ణయాన్ని వదిలేస్తే తెలంగాణవాదులు అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి. జగన్, చంద్రబాబులు అలా చెబితే మళ్లీ ఇబ్బందులు ఎదుర్కోక తప్పకపోవచ్చు.
కేంద్రమంత్రి చిరంజీవి సేఫ్ సైడ్కు వెళ్లిపోయారని చెప్పవచ్చు. 2009లో ఓ పార్టీ(ప్రజారాజ్యం) అధ్యక్షుడిగా ఆయన తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పాల్సిందే. పిఆర్పీని కాంగ్రెసులో విలీనం చేశాక ఆయన చేతులెత్తేసి కేంద్రంపై భారం వేశారు. తెలంగాణకు తాను వ్యతిరేకమంటూనే.. అధిష్టానం నిర్ణయానికి మాత్రం కట్టుబడి ఉంటానని చెప్పారు.
బిజెపి, టిఆర్ఎస్, సిపిఐ పార్టీలు తెలంగాణకు అనుకూలంగా చెబుతాయి. సిపిఎం మాత్రం సమైక్యవాదానికి ఓటేస్తుంది. మజ్లిస్ పార్టీ ఏం చెప్పనుందో సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే గతంలో కంటే ఓ అడుగు ముందుకు వేసే అవకాశముంది. తెలంగాణకు తాము వ్యతిరేకమని చెబుతూనే కేంద్రంపై నిర్ణయ బాధ్యతను వేసే అవకాశాలు ఉన్నాయి.
అఖిల పక్ష భేటీలో అన్ని పార్టీల కంటే ముందు కాంగ్రెసు పార్టీ తన నిర్ణయాన్ని వెల్లడించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మిగిలిన పార్టీల కంటే పెద్ద చిక్కు కాంగ్రెసుకే అని చెప్పవచ్చు. తెలంగాణకు ఓకే అంటే సీమాంధ్ర ప్రజాప్రతినిధులతో ఇబ్బంది.. సమైక్యాంధ్రకు ఓకే చెబితే తెలంగాణ ప్రజాప్రతినిధులు సొంత ఫ్రంట్ పెట్టడం, పార్టీ మార్చడం వంటివి జరుగుతాయి.
తెలంగాణకు ఓకే అంటే చంద్రబాబుకు ఇబ్బందే. పలువురు సీమాంధ్ర నేతలు జగన్ పార్టీలోకి జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ వ్యతిరేకం కాదని మాత్రమే ఆయన చెప్పనున్నారు. ఇప్పటికే ఆయన లేఖ రాశారనే కారణంతో ఇద్దరు చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు జగన్ వైపు వెళ్లారు. ఆయన కొత్తగా చెప్పేదేమీ లేదు. కాబట్టి పెద్దగా నష్టం జరగక పోవచ్చు. అలా ఏమైనా జరిగినా ప్రతిపక్షంలో ఉన్నారు. కాబట్టి ఆల్టర్నేట్ చూసుకుంటారు.
ఎటొచ్చి కాంగ్రెసుకే ఇబ్బంది. కాంగ్రెసుకు ఆల్టర్నేట్ చూసుకునే అవకాశముంది. కానీ ప్రభుత్వానికే ఇబ్బంది. చంద్రబాబు నిర్ణయం ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లింది కాబట్టి టిడిపికి నష్టం లేదు. కానీ కాంగ్రెసు అధిష్టానం మనసులో ఏముందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం ఇబ్బందుల్లో పడక తప్పదు!
అన్ని పార్టీల కన్నా ముందు కాంగ్రెసు పార్టీ తన నిర్ణయాన్ని చెప్పాల్సి ఉంది. ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో అనే ఆందోళనతో కాంగ్రెసు దానిపై తాత్సారం చేస్తూ వస్తోంది. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తెలంగాణకు వ్యతిరేకం కాదని, తెలంగాణ ప్రజల మనోగతాన్ని అర్థం చేసుకున్నామని చెబుతూనే.. నిర్ణయాధికారాన్ని కేంద్రంపై మోపుతున్నాయి. మజ్లిస్ పార్టీ తెలంగాణను వ్యతిరేకిస్తూనే కేంద్రం ఇష్టం అని చెబుతోంది. అఖిల పక్షం ఓ డ్రామాగా కొందరు కొట్టిపారేస్తున్నారు.
28న అఖిల పక్షం నేపథ్యంలో 2009 డిసెంబర్ 7న ఏ పార్టీ ఏం చెప్పిందంటే...
కాంగ్రెస్: తమది జాతీయ పార్టీ. పార్టీ అధిష్టానం దీనిపై నిర్ణయం తీసుకుంటుంది.
తెదేపా: 2009 ఎన్నికల సమయంలోని తమ మేనిఫెస్టోకి కట్టుబడి ఉన్నాం. మేనిఫెస్టో నిర్ణయాన్ని తాము మార్చుకోలేదు. ప్రభుత్వం తెలంగాణపై తీర్మానం పెడితే మద్దతిస్తాం.(డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణపై ప్రకటన చేసిన తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మరునాడు డిసెంబర్ 10 అర్ధరాత్రి ప్రకటన ఏమిటని ప్రశ్నించారు.)
భాజపా: తెలంగాణ రాష్ట్ర తీర్మానం పెడితే మద్దతు
తెరాస: తెలంగాణ రాష్ట్ర తీర్మానం పెడితే మద్దతు
ప్రజారాజ్యం: తీర్మానం పెడితే మద్దతు (డిసెంబర్ 9న ప్రకటన తర్వాత యూ-టర్న్ తీసుకుంది)
సిపిఎం: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి మొగ్గు చూపం
సిపిఐ: తెలంగాణ తీర్మానం పెడితే మద్దతిస్తాం
మజ్లిస్: అసెంబ్లీలో తెలంగాణపై చర్చించాలి(విభజన, సమైక్యంపై ఏమీ చెప్పలేదు, హైదరాబాద్ రాజధానిగా రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలి)