నోరు జారిన వెంకయ్య: ఏడ్చేసిన మహిళా ఎంపీ
వెంకయ్య నాయుడు ప్రసంగానికి అడ్డు తగులుతూ ప్రభా ఠాకూర్ - 'పుర్తి గ్రూప్లో బీజేపీ అధ్యక్షుడు గడ్కరీకి పెట్టుబడులు ఉన్నాయి కదా!' అని అన్నారు. దీంతో వెంకయ్య నాయుడు అమెపై కఠినమైన వ్యాఖ్య చేశారు. దాంతో ప్రభా ఠాకూర్ నిశ్చేష్టురాలై కంటతడి పెట్టారు. వెంకయ్య వ్యాఖ్యపై రేణుకా చౌదరి, వి.హనుమంతరావు ఇతర కాంగ్రెస్ సభ్యులంతా తీవ్రంగా మండిపడ్డారు.
తమ సభ్యురాలిని అభ్యంతరకర భాషలో దూషించడంపై క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. అధికార పక్ష సభ్యులంతా నిరసనకు దిగడంతో డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. ఆ సందర్భంగా లాబీల్లో ప్రభా ఠాకూర్ను వెంకయ్య కలిశారు. ఆమెకు క్షమాపణలు చెప్పారు.
సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కాంగ్రెసు సభ్యులు వెంకయ్యపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యకు ప్రభా ఠాకూర్ బాధపడితే తాను తాను విచారం వ్యక్తం చేస్తున్నానని, తాను కావాలని ఆ వ్యాఖ్య చేయలేదని వెంకయ్య నాయుడు అన్నారు. వేడిలో మాత్రమే తాను ఆ మాట అన్నానని ఆయన చెప్పారు. దీంతో ఆ విషయం అంతటితో ముగిసిపోయింది.
వెంకయ్య తీరును కురియన్ మెచ్చుకున్నారు. "ఏ సభ్యుడికైనా క్షమాపణ చెప్పాలని ఏ సభ్యుడినీ అధ్యక్షస్థానం ఆదేశించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వెంకయ్య వైఖరి ప్రశంసనీయం'' అని అన్నారు.