చిచ్చు: బాబుకు సుజనా రాజీనామా లేఖ, వారిపై ఒత్తిడి
తాను క్షమాపణలు చెప్పినప్పటికీ కొందరి నేతల మాట తీరు తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. పార్టీలో జరుగుతున్న తీరుపై తాను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు లేఖ రాశానని చెప్పారు. తాను ఎంపి పదవికి రాజీనామా చేసినప్పటికీ తెలుగుదేశంలో యధావిధిగా కొనసాగుతానని చెప్పారు. కొందరు పార్టీ నేతల మాటలు తనను మానసికంగా బాధించాయని సుజనా చౌదరి అన్నారు. టిడిపి సిద్ధాంతాలు గౌరవించే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు.
కాగా రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, దేవేందర్ గౌడ్, గుండు సుధారాణిలు ఎఫ్డిఐ ఓటింగు సమయంలో గైర్హాజరైన విషయం తెలిసిందే. దీనిపై పార్టీకి చెందిన సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, కొత్తకోట దయాకర్ రెడ్డి, యనమల రామకృష్ణుడు తదితరులు ధ్వజమెత్తారు. ఇతర పలువురు నేతలు కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. దీంతో ఆయన రాజీనామా చేశారు.
మరోవైపు సుజనా చౌదరి రాజీనామా దేవేందర్ గౌడ్, గుండు సుధారాణిలపై ఒత్తిడి పెంచే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సుజనా రాజీనామా బాబు ఆమోదిస్తే వీరి రాజీనామా కోసం పార్టీలోని వీరి వ్యతిరేక వర్గం డిమాండ్ చేసే అవకాశముంది. బాబు రాజీనామాపై ఏం చేస్తారా అని పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారు.