కాంగ్రెస్పై సమరభేరీ సభ: సొంత ఎంపీలపై తలసాని ఫైర్
ఎఫ్డిఐలకు వ్యతిరేకంగా ఓటు వేయని ముగ్గురు పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేయాలని, వారు ముగ్గురు పోతే పార్టీకి ముప్పై లక్షల మంది వస్తారని తలసాని అన్నారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సామాన్య కార్యకర్త అయినా పెద్ద నాయకుడికైనా శిక్ష ఒకేలా ఉంటుందనే సంకేతాలు పార్టీ శ్రేణులకు వెళ్లాలని సూచించారు. రాజ్యసభలో గైర్హాజరైన వారి తీరును అందరూ ఖండిస్తున్నారన్నారు.
బాబు ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించారన్నారు. టిడిపికి బలమైన కార్యకర్తల పునాది ఉందని, దాని వల్ల చెక్కుచెదరలేదని సభ ద్వారా స్పష్టమైందన్నారు. జంటనగరాల్లో అభివృద్ధి టిడిపి పేటెంట్హక్కుగా పేర్కొన్నారు. హైదరాబాదీగా చెప్పుకునే కిరణ్ కుమార్ రెడ్డిని వెన్నుముకలేని సిఎంగా విమర్శించారు. తన సీటు ఉంటుందా? ఉండదా? అన్న అనుమానం తప్ప ప్రజల సమస్యల పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నగరంలోని మంత్రులు ముఖేష్, దానం నగేందర్ సిఎంను ఫుట్బాల్ ఆడకుంటున్నారన్నారు.
రాష్ట్రాన్ని ఇద్దరు తోడు దొంగలు దోచుకుంటున్నారని ఎమ్మెల్యే, నగర పార్టీ ఇన్ఛార్జి మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. కెసిఆర్ తెలంగాణ సెంటిమెంట్తో దోచుకు తింటుంటే, జగన్ అవినీతి, అక్రమాలతో కోట్ల రూపాయల ప్రజాసొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి విజయ రామారావు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని అన్నారు. ప్రజా రవాణా కోసం ఏర్పాటుచేసే మెట్రోరైల్ను కూడా రియల్ వ్యాపారంగా మార్చుకుని వేల కోట్లు దోచుకుతింటున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు.