నానిపై వేటేశారు మరి ఇప్పుడు: బాబుకు జగన్ పార్టీ
లక్షలాదిమంది చిల్లర వ్యాపారస్థులను వీధిన పడేటట్లు చేసిన ఘనత చంద్రబాబుదే అని మండిపడ్డారు. రాజ్యసభలో ఓటింగుకు విప్ ఎందుకు జారీ చేయలేదో బాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎల్లో మీడియా, పత్రికలు చంద్రబాబు గరంగరం అని పైపైకి ప్రచారం చేస్తున్నాయని, అసలు ఓటింగులో టిడిపి విధానం స్పష్టం చేయాలని శోభా నాగి రెడ్డి ప్రశ్నించారు. ఓటు వేయక పోవడం ద్వారా ఎఫ్డిఐలకు టిడిపి అనుకూలమన్నట్లుగా ఉందన్నారు.
ఎఫ్డిఐలపై రాజ్యసభలో ఎంపీలు ఓటింగుకు గైర్హాజరు కావడంపై చంద్రబాబు సమాధానం చెప్పాలని కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కేంద్రంలో కాంగ్రెసు ప్రభుత్వాన్ని నిలబెట్టే బాధ్యతను భుజాన వేసుకున్న చంద్రబాబు తన పార్టీ రాజ్యసభ సభ్యులను ఓటింగుకు పంపలేదని ఆరోపించారు. బాబు స్వప్రయోజనాలు కాపాడుకోవడానికే కేంద్రానికి బాసటగా నిలిచారని నిప్పులు చెరిగారు.
బాబు ఆశీస్సులతోనే తాము ఎఫ్డిఐలపై రాజ్యసభలో జరిగిన ఓటింగులో పాల్గొనలేదని టిడిపి సభ్యులు కూడా స్పష్టం చేశారని, అయినా వారి నుంచి సంజాయిషీ కోరుతానని చంద్రబాబు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో జగన్ని జైలులో కల్సిన వెంటనే గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నానిని, విజయవాడలో మర్యాదపూర్వకంగా కల్సిన వల్లభనేని వంశీని ప్రశ్నించిన బాబు వారిని సస్పెండ్ చేయకుండా సంజాయిషీ కోరతాననడం విడ్డూరంగా ఉందన్నారు.