ఏ పార్టీయో చెప్పలేను: జయప్రద, చేరికపై తర్జన భర్జన
ఇప్పుడు కూడా తాను వస్తానని, ఏ పార్టీలో చేరేది మాత్రం అప్పుడే చెప్పలేనన్నారు. ఆమె వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఏ పార్టీలో చేరాలనే నిర్ణయంపై తర్జన భర్జన పడుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. జయప్రద కాంగ్రెసు పార్టీలోకి వెళ్లే అవకాశాలు లేవు. గతంలో టిడిపిలో ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో స్వల్ప విభేదాల కారణంగా ఆమె ఉత్తర ప్రదేశ్కు వెళ్లి పోయారు.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పాటు కొత్తగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పుట్టుకు వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నేతలు జగన్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇటీవల జరిగిన పలు ఉప ఎన్నికల్లోనూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే గెలిచింది. ఈ నేపథ్యంలో గత పరిచయం కారణంగా ఆమె మనసు తెలుగుదేశం పార్టీ వైపుకు లాగుతున్నప్పటికీ జగన్ పార్టీ హవా కొనసాగుతుండటంతో అటువైపు కూడా ఆలోచిస్తున్నట్లుగా ఉందంటున్నారు.
అందుకే సంవత్సరంన్నరగా రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తానని సంకేతాలు ఇస్తున్న జయప్రద ఏ పార్టీలో తేలే అంశాన్ని మాత్రం తేల్చలేక పోతున్నారని అంటున్నారు. పార్టీలో చేరే అంశాన్ని ప్రశ్నిస్తే ఆమె తాను ప్రస్తుతం యూపి రాజకీయాల్లో ఉన్నానని, కాబట్టి ఇప్పుడే చెప్పడం సమంజసం కాదని కూడా గతంలో చెప్పారు. టిడిపిలో చేరాలా లేక జగన్ పార్టీలో చేరాలా అనే దానిపై ఆమె తేల్చుకోలేకపోతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.