కర్నాటకం: యడ్డీ బలప్రదర్శన, జెడి(ఎస్)వైపు బిజెపి..
భారీగా బిజెపి ప్రజాప్రతినిధులను తన సమావేశానికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తన వైపు యాభై మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన పలుమార్లు ప్రకటనలు కూడా చేశారు. యడ్డీ భయంతో బిజెపి రాష్ట్రంలోని జగదీష్ శెట్టార్ ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో పడింది. ఇందుకోసం జెడి(ఎస్)తో మంతనాలు సాగిస్తోంది. ఆ పార్టీతో పొత్తు ప్రయత్నాలు చేస్తోంది.
యడ్డీ వైపు వెళ్తున్న మంత్రులను ఇప్పటికే ఆ పదవుల నుండి తొలగించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను సస్పెండ్ చేశారు. యడ్డీ సభకు ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్లకుండా ఉండేందుకే బిజెపి అధిష్టానం వ్యూహాత్మకంగా వారిపై వేటు వేసింది. యడ్డీకి విధేయులుగా ఉన్న ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేసింది. సహకార మంత్రి పుట్టస్వామిని పదవి నుండి తొలగించింది. తుమకూరు ఎంపీ బసవరాజును పార్టీ నుండి సస్పెండ్ చేసింది.
తన వర్గం ఎమ్మెల్యేలపై వేటు వేయడంపై యడ్డీ తీవ్రంగా స్పందించారు. బిజెపి తన వర్గం నేతలపై వేటు వేస్తోందని, అయినప్పటికీ పలువురు పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నారన్నారు. తనకు జగదీష్ శెట్టార్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని లేదని, పూర్తి కాలం కొనసాగనిస్తానని చెప్పారు. అయితే బిజెపి తన వర్గం నేతలపై చర్యలు తీసుకుంటే మాత్రం జరగబోయే పరిణామాలకు తాను బాధ్యుడిని కాదన్నారు.