కిరణ్ను తెలంగాణ అడ్డుకున్నారు: కాంగ్రెసు ఎంపీలు
కిరణ్ కుమార్ రెడ్డి మూలంగానే తెలంగాణ అంశం వెనక్కి పోయిందని వారు విమర్శించారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తెలంగాణ విషయంలో పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నాయని వారున్నారు. అఖిల పక్ష సమావేశంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తమ వైఖరిని చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెసు అభిప్రాయం చెప్తేనే తాము చెప్తామని తప్పించుకునే ధోరణి వద్దని వారన్నారు. తెలంగాణలో పాదయాత్రలు చేస్తూ తెలంగాణపై స్పష్టమైన అభిప్రాయం చెప్పకపోతే ఎలా అని వారన్నారు.
తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. అఖిల పక్ష సమావేశం వాయిదా వేయాలని కోరి తాను సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రిని అని నిరూపించుకున్నారని వారు వ్యాఖ్యానించారు. సీమాంద్రలో పార్టీ ఉంటే చాలు, తెలంగాణలో పార్టీ పోయినా ఫరవా లేదనే పద్ధతిలో కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారని వారన్నారు.
తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పకపోతే తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదని వారన్నారు. కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు సోమవారం కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు. అఖిల పక్ష సమావేశాన్ని వాయిదా వేయవద్దని వారు కోరారు. షిండే కూడా సమావేశాన్ని వాయిదా వేయడానికి నిరాకరించారు. కాగా, కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లడపాటి రాజగోపాల్ షిండేను కలిశారు.