వైయస్ నష్టం ఎన్టీఆర్తో: జగన్ కోసం పురంధేశ్వరి?
హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి క్రెడిట్ అంతా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి వెళుతుండటంతో కాంగ్రెసు పార్టీ అధిష్టానం రాష్ట్రంలో కొత్త వ్యూహాలకు పదును పెట్టిందా? అంటే అవుననే అంటున్నారు. వైయస్సార్ క్రెడిట్ ఎక్కువగా జగన్కే వెళుతోంది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని బతికించుకోవడం కోసం అధిష్టానం స్వర్గీయ నందమూరి తారక రామారావును కూడా ఉపయోగించుకునే పనిలో పడినట్లుగా స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.
పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు కోసం ఏళ్లుగా ఇటు తెలుగుదేశం పార్టీ కావొచ్చు, అటు కేంద్రమంత్రి పురంధేశ్వరి కావొచ్చు కేంద్రాన్ని కోరుతున్నారు. అయితే ఇన్నాళ్లుగా ఎన్టీఆర్ విగ్రహం పట్ల స్పందించకుండా ఒక్కసారిగా ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చంద్రబాబును వ్యతిరేకించి ఎన్టీఆర్ అభిమాన గణాన్ని కేంద్రమంత్రి పురంధేశ్వరి ద్వారా తమ వైపుకు తిప్పుకోవాలనేది కాంగ్రెసు పార్టీ వ్యూహంగా చెబుతున్నారు.
పురంధేశ్వరి విజ్ఞప్తి మేరకు ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్లమెంటులో తామే పెట్టించామని కాంగ్రెసు రాష్ట్రంలో చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఆ సామాజిక వర్గాన్ని, బాబు వ్యతిరేక ఎన్టీఆర్ అభిమానుల్ని బుట్టలో వేసుకోవాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. వైయస్ ద్వారా జరిగే నష్టాన్ని ఎన్టీఆర్ ద్వారా పూడ్చుకోవడానికే ఇలా చేసినట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి తన హయాంలో ప్రవేశ పెట్టిన పథకాలను కేవలం వైయస్ పథకాలుగా వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ ప్రచారం చేస్తోంది. దీంతో ఎక్కువమంది ప్రజలు వాటిని కాంగ్రెసు పథకాలుగా కాకుండా వైయస్ పథకాలుగానే భావిస్తున్నారు. ఎన్టీఆర్కు ప్రాధాన్యత ఇస్తే పురంధేశ్వరి కారణంగా తాము లబ్ధి పొందడమే కాకుండా టిడిపికి కొంతలో కొంత అయినా నష్టం జరుగుతుందని భావిస్తున్నట్లుగా ఉందని అంటున్నారు.