ఎన్టీఆర్ విగ్రహం: చంద్రబాబుపై పురంధేశ్వరి పైచేయి?
చంద్రబాబు నాయుడు మాత్రం దాన్ని తెలుగుదేశం పార్టీ వ్యవహారంగా చూసి, పార్టీపరంగానే విగ్రహాన్ని ప్రదానం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఎన్టీ రామారావు విగ్రహ ప్రతిష్టాపన అంశాన్ని ముందుకు తీసుకుని నడిపించామని చంద్రబాబుతో పాటు తెలుగుదేశం నాయకులు అంటున్నారు. పైగా, పురంధేశ్వరికి వ్యతిరేకంగా బాలకృష్ణను ప్రయోగించడం సమస్యను మరింత జఠిలం చేసింది. బాలకృష్ణ వ్యాఖ్యలను పురంధేశ్వరి స్పష్టంగా ఖండించడమే కాకుండా ఏం జరిగిందో కూడా వివరించారు. కుటుంబపరంగా విగ్రహం ప్రదానం చేయడానికి తనకు ఏ విధమైన అభ్యంతరం లేదని ఆమె అంటున్నారు.
బాలకృష్ణ పురంధేశ్వరిని ఖండించడానికి మళ్లీ ముందుకు వస్తారా అనేది ప్రశ్న. పైగా, తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు, ఎన్టీ రామారావు మరో కుమారుడు హరికృష్ణ పురంధేశ్వరికి మద్దతుగా నిలబడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అల్లుళ్లకు, పార్టీలకు ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనతో సంబంధం లేదనే విధంగా మాట్లాడడం చంద్రబాబుకు ఎదురుదెబ్బగానే భావిస్తున్నారు.
ఎన్టీ రామారావు సంతానం 11 మంది సంతకాలు చేసి ఇస్తే విగ్రహ ప్రతిష్టాపనకు తమకు అభ్యంతరాలు లేవని స్పీకర్ కార్యాలయం చెబుతోంది. అందువల్ల పార్టీలను, ఇతర కుటుంబ సభ్యులను పరిగణనలోకి తీసుకోవడానికి స్పీకర్ కార్యాలయం సిద్ధంగా లేనట్లు కూడా అనుకోవచ్చు. ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన కోసం కుటుంబ సభ్యులందరనీ సంప్రదించానని పురంధేశ్వరి చెప్పారు. చంద్రబాబు ఇంటికి మూడు సార్లు పంపించానని, ఇంట్లో ఎవరూ లేరని తనకు సమాధానం వచ్చిందని ఆమె చెప్పారు.
ఎన్టీ రామారావు విగ్రహం ప్రతిష్టాపన జరగాలా, రాజకీయ ప్రాధాన్యం చూసుకోవాలా అనే విషయమే ఇప్పుడు ప్రధాన అంశంగా ముందుకు వచ్చింది. రాజకీయాలను పక్కన పెట్టాలనే ఆలోచన ముందుకు వస్తే విగ్రహ ప్రతిష్టాపనకు ఎవరు చొరవ తీసుకుంటే ఏమిటనే ప్రశ్న ఉదయిస్తుంది. ఈ రకంగా కూడా పురంధేశ్వరీదే పైచేయి అవుతుంది.