జగన్ బెయిల్ విచారణ వాయిదా: మోపిదేవికి సిబిఐ నో
మోపిదేవి బెయిల్ పిటిషన్ వాయిదా
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్గూడ జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణకు బెయిల్ ఇవ్వవద్దని సిబిఐ గురువారం నాంపల్లి ప్రత్యేక కోర్టులో కౌంటర్ వేసింది. కోర్టు మోపిదేవి బెయిల్ పైన తదుపరి విచారను ఈ నెల 18వ తేదికి వాయిదా వేసింది.
తాను అయ్యప్ప మాల వేశానని, శబరికి వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని మోపిదేవి మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాను పందొమ్మిదేళ్లుగా అయ్యప్ప మాలను యధావిధిగా వేస్తున్నానని, అలాగే ఈసారి వేశానని, శబరికి వెళతానని అనుమతించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల 24వ తేది నుండి వచ్చే నెల 2వ తేది వరకు తనకు అనుమతివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.
దీనిపై సిబిఐ ఈ రోజు కౌంటర్ దాఖలు చేసింది. మోపిదేవికి బెయిల్ ఇవ్వవద్దని, ఇస్తే సాక్ష్యాలు తారుమారు కావొచ్చునని సిబిఐ కౌంటర్ పిటిషన్లో పేర్కొంది. జగన్ ఆస్తుల కేసు కీలక దశలో ఉందని తెలిపింది. మోపిదేవి బయటకు వెళ్తే ప్రభావం పడుతుందని, సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందని సిబిఐ కోర్టుకు తెలిపింది. దీంతో సిబిఐ ప్రత్యేక కోర్టు విచారణను ఈ నెల 18వ తేదికి వాయిదా వేశారు.